
కుట్టు మెషిన్కి కేరాఫ్ ఉషా బ్రాండ్. అప్పట్లో ఏ ఊళ్లో చూసినా ఉషా కంపెనీ కుట్టు మెషిన్లే కనిపించేవి. అఫ్కోర్స్ ఇప్పటికీ కనిపిస్తాయి. ఒకప్పుడు కాళ్లతో పెడల్ తొక్కుతూ కుట్టే మెషిన్ను తయారుచేసింది. ఆ తరువాత కరెంట్తో నడిచే ఆటోమెటిక్ కుట్టు మెషిన్ను మార్కెట్లోకి తెచ్చింది ఈ కంపెనీ. ఆ మెషిన్ టెక్నాలజీ డెవలప్ అయినట్టే కంపెనీ కూడా డెవలప్ అవుతూ వస్తోంది. పూర్వం నష్టాల్లో ఉన్న కంపెనీ ఇప్పుడు వందల కోట్ల లాభాల్లో నడుస్తోంది. కుట్టు మెషిన్ల తయారీతో మొదలై ఇప్పుడు ఎన్నో హోం అప్లయెన్సెస్ కూడా తయారుచేస్తోంది. చిన్న కంపెనీగా మొదలై వందల కోట్ల టర్నోవర్ వచ్చే స్థాయికి ఎదిగింది ఉషా కంపెనీ. స్వాతంత్ర్యం రాకముందే ఇండియన్ టెక్నాలజీతో తయారుచేసిన కుట్టుమెషిన్ని మార్కెట్లోకి తెచ్చిన మొదటి కంపెనీ ఉషా. ఈ కంపెనీ స్థాపనకు కారకుడైన బిషన్దాస్ బాసిల్ మొదటి ఇండియన్ కుట్టుమెషిన్ ప్రోటోటైప్ని తయారుచేశాడు. వాస్తవానికి ఉషా కుట్టు మెషిన్ చరిత్ర1935లో బిషన్ దాస్ బాసిల్తోనే మొదలైంది. ఆయనకు ఇండియన్ ఇంజనీరింగ్ పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంది. బాసిల్ తండ్రి గంగారామ్ లుథియానాలో మిఠాయి దుకాణం నడిపేవాడు. అతని పిల్లల్లో బాసిల్ తప్ప మిగతా వాళ్లంతా అదే వ్యాపారంలో చేరారు. బాసిల్ మాత్రం స్కాలర్షిప్తో 1901లో రూర్కీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చేరాడు. అక్కడ చదువుతున్నప్పుడే బ్రిటన్లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకునేందుకు మరో స్కాలర్షిప్ దక్కించుకున్నారు. తర్వాత1906లో ఇండియాకి వచ్చి కలకత్తాలోని పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగంలో చేరాడు.అతనికున్న ఎక్స్ట్రార్డినరీ టాలెంట్ వల్ల తక్కువ టైంలోనే సెంట్రల్ టెలిగ్రాఫ్ ఆఫీస్కు అనుబంధంగా ఉన్న వర్క్షాప్కు సూపరింటెండెంట్గా ప్రమోషన్ తెచ్చుకున్నాడు. అక్కడ ఎప్పుడూ రీసెర్చి, ఎక్స్పరిమెంట్స్ చేస్తుండేవాడు. టెలిగ్రాఫ్, టెలిఫోన్ సిస్టమ్స్లో వాడే పరికరాల్లో మార్పులు చేస్తుండేవాడు. ఇలా చేస్తున్నప్పుడే ఆయనకు టెక్నాలజీ విషయంలో ఇండియా ఇతర దేశాల మీద ఎంతలా ఆధారపడుతుందో అర్థమైంది. అందుకే దేశ సాంకేతికాభివృద్ధికి తనవంతుగా ఏదైనా చేయాలని డిసైడ్ అయ్యాడు.
రిటైర్మెంట్ ఏజ్లో ఎంట్రప్రెనూర్
చాలా ఏండ్లు ఉద్యోగం చేస్తూనే గడిపాడు బాసిల్. రిటైర్మెంట్ వయసు దగ్గరపడేసరికి ఎంట్రప్రెనూర్గా మారాలి అనుకున్నాడు. అదే టైంలో1934లో ఇండియాకు ఒకేసారి 60,000 కుట్టు మెషిన్లు దిగుమతి అయ్యాయని తెలుసుకున్నాడు. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ముందే ఊహించాడు. అందుకే స్వదేశీ కుట్టు మెషిన్ని తయారు చేసి, తక్కువ ధరలో అందించాలి అనుకున్నాడు. కలకత్తాలోని తన స్టాఫ్ క్వార్టర్స్లోని ఒక గదిని వర్క్షాప్గా మార్చుకున్నాడు. స్వదేశీ కుట్టు మెషిన్ని తయారుచేయడానికి జర్మన్ కుట్టు మెషిన్ని ప్రోటోటైప్గా తీసుకున్నాడు. కానీ.. అప్పటికి ఇండియాలో మాన్యుఫాక్చరింగ్ రంగం పెద్దగా డెవలప్ కాలేదు. ఒక నమూనా ఇస్తే.. దాన్ని తయారుచేసేంత టెక్నాలజీ మన దగ్గర లేదు. అందుకోసం కావాల్సిన మిల్లింగ్, డ్రిల్లింగ్, లేత్, క్యాప్స్టన్ లాంటి టూల్స్ లేవు. అంతేకాదు.. పంప్, జాక్, హింగ్, హ్యాండిల్, నాబ్, ఫాస్టెనర్స్, బోల్ట్, హుక్ రాక్, సాడిల్స్, వెయింగ్ మెషిన్లు లాంటివి కూడా సరిగా అందుబాటులో లేవు. అందుకే బాసిల్కు ఇండియన్ కుట్టు మెషిన్ని తయారుచేసేందుకు ఏడాది పట్టింది. తర్వాత ఆ మెషిన్ని ఫైన్గా మార్చేందుకు మరో రెండేండ్లు పట్టింది. మొత్తానికి మెషిన్ తయారైంది. కానీ.. అది చూడ్డానికి అంత బాగాలేదు. పైకి ఎలా ఉన్నా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే కుట్టడానికి బాగానే ఉండేది.
తయారీ తిప్పలు
ఫిట్టర్లు, అసెంబ్లర్లు, టర్నర్లు, మిల్లర్లు, ఫౌండరీ లేబర్.. ఇలా అన్ని రకాల ఉద్యోగుల్ని రిక్రూట్ చేసుకున్నాడు. మొత్తం75 మంది ఉద్యోగులతో మెషిన్కు ఉండే 25 విడిభాగాలైన స్క్రూలు, పిన్స్, వాషర్లు, స్ప్రింగ్లను తయారుచేయించాడు. అందుకోసం అప్పట్లోనే 25,000 రూపాయలు ఖర్చుచేశాడు. ఇక మిగతా ఎక్విప్మెంట్స్ షటిల్, బాబిన్, ఫీడ్ డాగ్, సూదులు జర్మన్ కుట్టు మెషిన్కు వాడేవి వేరే దుకాణాల నుంచి తెప్పించాడు. అలా1936 చివరి నాటికి 25 కుట్టు మెషిన్లు తయారు చేయగలిగారు. వాటిని తన చిన్న కూతురు ‘ఉషా’ పేరుతో మార్కెట్లోకి విడుదలచేశాడు.
గుడ్బై చెప్పాలని...
దేశంలోనే మొదటి కుట్టు మెషిన్ ఉషా. అందుకే సేల్స్ టీమ్ దాన్ని స్వదేశీ కుట్టుమెషిన్ అని ప్రచారం చేశారు. మెషిన్ బాగానే పనిచేస్తుంది. కానీ.. విదేశీ మెషిన్లతో పోలిస్తే.. పెయింట్ బాగోలేదు. కుట్టే స్పీడ్ కాస్త నెమ్మదిగా ఉంది. బేస్, స్టాండ్ సరిపోలేదు. మెషిన్ వీల్, స్టాండ్ ఫిట్టింగ్ సరిగా లేదు. దాంతో తరచుగా మెషిన్ జామ్ అయ్యేది. దాంతో ఆ మెషిన్ పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ.. దాన్ని మరింత ఫైన్ చేయడానికి బాసిల్ దగ్గర డబ్బు లేదు. అప్పటికే మెషిన్ కోసం 92 వేల రూపాయలు అప్పు చేశాడు. దాంతో ప్రాజెక్ట్కు గుడ్బై చెప్పాలని డిసైడ్ అయ్యాడు.
లాలా శ్రీరామ్ ఎంట్రీ
వాస్తవానికి ఉషా మెషిన్ని తయారు చేసింది బాసిల్ అయినప్పటికీ ప్రొడక్షన్ కంపెనీ పెట్టింది మాత్రం లాలా శ్రీరామ్. మెషిన్ని డెవలప్ చేయడానికి డబ్బుల్లేక ఇబ్బంది పడుతున్న టైంలో ఉషా మెషిన్ సప్లయర్స్లో ఒకరు బాసిల్ని డీసీఎం మిల్లుల యజమాని లాలా శ్రీరామ్కు పరిచయం చేశారు. ఆయన బాసిల్ టాలెంట్ చూసి ఇంప్రెస్ అయ్యాడు. ఉషా కుట్టు మెషిన్ను డెవలప్ చేసి, ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చాడు. కానీ.. అప్పట్లో ఒక పూర్తి స్వదేశీ కుట్టు మెషిన్ తయారుచేయాలంటే.. 220 భాగాలు విడివిడిగా తయారుచేయాలి. అందుకోసం జిగ్, ఫిక్చర్లతో పాటు కొన్ని ప్రత్యేక ముడి పదార్థాలు కావాలి. ఆ టైంలో కొన్ని ఇండియాలో దొరికేవి కావు. వాటిని తయారుచేసేందుకు చాలా పెద్ద కంపెనీ పెట్టాల్సి వచ్చింది శ్రీరామ్కు.
ఉషా ప్రయాణం అలా మొదలైంది
లాలా శ్రీరామ్, అతని ఫ్రెండ్స్ హన్స్ రాజ్ గుప్తా, భగత్లతో పాటు మరో ముగ్గురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు పదంపట్ సింఘానియా, కేఎల్ పొద్దార్, కరంచంద్ థాపర్తో కలసి ఒక కొత్త పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ బోర్డు ఏర్పడింది. కోల్కతాలోని ప్రిన్స్ అన్వర్ షా రోడ్లో కొంత భూమిని కొన్నారు. యూరప్ నుండి కొన్ని మెషిన్లు తెప్పించారు. సేల్స్ టీమ్స్, కమీషన్ ఏజెంట్లు, షోరూమ్లు, డెమో యూనిట్లు, మార్కెటింగ్ ప్లాన్లు, కస్టమర్ ఫిర్యాదుల యూనిట్లు, అడ్వర్టైజింగ్ టీమ్లు.. ఇలా ఒక్కో డిపార్ట్మెంట్ ఏర్పాటుచేశారు.
యుద్ధంతో నష్టాలు
స్వదేశీ కుట్టు మెషిన్లను తయారు చేసి అమ్మడం మొదలుపెట్టారు. కానీ.. అంతలోనే 1939లో రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. దాని ఎఫెక్ట్ వల్ల మన దగ్గర కూడా సేల్స్ తగ్గిపోయాయి. అప్పట్లో కలకత్తా మీద వైమానిక, బాంబు దాడులు జరుగుతాయనే ప్రచారం సాగింది. దాంతో కార్మికులు అంతా సొంతూళ్లకు వెళ్లిపోయారు. దాంతో దాదాపు 38 వేల రూపాయల నష్టంతో బుకింగ్స్ఆపేయాల్సి వచ్చింది. దాంతో కుట్టు మెషిన్ ప్రాజెక్ట్ పూర్తిగా ఆగిపోయింది. కంపెనీలో రైల్వే సిగ్నలింగ్, ఐరన్ పికెట్లు, జీప్ కార్ల కోసం చాసిస్లు, వేడి నీటి బాయిలర్లు తయారుచేశారు. బాసిల్ ఇంజనీరింగ్ స్కిల్స్ వల్ల వాటిలో కూడా కంపెనీకి బాగా లాభాలు వచ్చాయి.1942 నాటికి 6,83,677 రూపాయల లాభాల్లో ఉంది. అప్పుడు లాలా శ్రీరామ్ తన పార్ట్నర్స్కి ఒక ఆఫర్ ఇచ్చాడు. “ఇన్ని సంవత్సరాలుగా ఒక ఫెయిల్యూర్ వెంచర్లో నేను, మీరు చిక్కుకున్నామని అనుకున్నా. కానీ.. ఇప్పుడు లాభాలు వచ్చాయి. సంస్థ ఇప్పుడు బాగానే ఉంది. కాబట్టి ఎవరైనా తమ వాటాలను అమ్మాలి అనుకుంటే ఇప్పుడే మంచి ధరకు వదులుకోవచ్చు. తర్వాత నష్టాలు రావచ్చు’ అని చెప్పాడు. కానీ.. శ్రీరామ్ మీద నమ్మకంతో ఎవరూ షేర్లు అమ్ముకోలేదు.
బాసిల్ రాజీనామా
మెషిన్ కనిపెట్టి కంపెనీ స్థాపనకు కారణమైన బిషన్ దాస్ బాసిల్ ఫ్యాక్టరీ మేనేజర్ ఉద్యోగానికి డిసెంబరు1943లో రాజీనామా చేశాడు. కుట్టు మెషిన్ డిజైన్ని ఇచ్చినందుకు కంపెనీ అతనికి కొంత రాయల్టీ చెల్లించింది. యుద్ధం అప్పుడు లాభాలు తెచ్చినందుకు కూడా కొంత డబ్బు ఇచ్చింది. అదొక్కటే కాకుండా కొత్త వెంచర్లను మొదలుపెట్టుకునేందుకు 25,000 రూపాయలు ఇచ్చింది.
నెలకు వెయ్యి కుట్టు మెషిన్లు
కంపెనీలో కుట్టు మెషిన్ల తయారీని మళ్లీ మొదలుపెట్టారు. దాంతో పాటు కంపెనీ భవిష్యత్తులో ప్రొడక్షన్ ఆపే పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో ప్రజలు ఎప్పుడూ వినియోగించే కొన్ని ప్రొడక్ట్స్ తయారుచేయడం మొదలుపెట్టారు. కుట్టు మెషిన్లతోపాటు, ఎలక్ట్రిక్ ఫ్యాన్లు, ప్రెషర్ కుక్కర్లు తయారు చేశారు. చాలా తక్కువ టైంలోనే అమ్మకాలు పెరిగాయి. ఉషా కుట్టు మెషిన్లకు మంచి పేరొచ్చింది. 1947లో నెలకు వెయ్యి కుట్టు మెషిన్లను కంపెనీ ఉత్పత్తి చేసింది. 1951 నుండి 1961 దశాబ్దంలో ఉషా కుట్టు మెషిన్ అమ్మకాలు తొమ్మిది రెట్లు పెరిగాయి.
అంచెలంచెలుగా...
ఒకప్పుడు నష్టాలను చూసిన కంపెనీ ఇప్పుడు అంతర్జాతీయ కంపెనీగా ఎదిగింది. 1946లో ఫ్యాన్లను తయారు చేయడం మొదలుపెట్టింది. 1984లో ఉషా హోమ్ అప్లయెన్సెస్ మార్కెట్లోకి వచ్చాయి.1982లో కంపెనీ పేరు ‘ఉషా సేల్స్’ నుంచి ‘ఉషా ఇంటర్నేషనల్’గా మారింది. దేశ వ్యాప్తంగా వందల సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఆటోమెటిక్ కుట్టు మెషిన్లు, డిజైనర్ సీలింగ్ ఫ్యాన్లు, కిచెన్ అప్లయెన్సెస్, టిస్వా పేరుతో ప్రీమియం ఎల్ఈడీ లైట్లు ఉత్పత్తి చేస్తోంది. కంపెనీ డెవలప్మెంట్ కోసం ఇప్పటికీ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. సేల్స్ మీద వచ్చే లాభాల్లో దాదాపు 4.5 శాతం డబ్బుని బ్రాండ్ బిల్డింగ్ కోసం వాడుతున్నారు. కొత్త ప్రొడక్ట్స్ డెవలప్మెంట్ కోసం దాదాపు 3 శాతం ఖర్చు చేస్తున్నారు.