- ఆయనపై ప్రస్తుతం ఎలాంటి చర్యలు తీసుకోవద్దు
- కర్నాటక హైకోర్టు ఆదేశాలు.. విచారణ 29కి వాయిదా
బెంగళూరు: మైసూర్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (ముడా) కేసులో కర్నాటక సీఎం సిద్ధరామయ్యకు తాత్కాలిక ఊరట లభించింది. ఈ కేసులో సిద్ధరామయ్యను విచారించాలంటూ గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ఇచ్చిన ఆదేశాలపై ఆయన సోమవారం కర్నాటక హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. సిద్ధరామయ్యపై ప్రస్తుతం ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 29కి విచారణను వాయిదా వేసింది. అప్పటి వరకు కోర్టు ఆర్డర్స్ అమలులో ఉండనున్నాయి. సిద్ధరామయ్య భార్య పార్వతమ్మ పేరిట ఉన్న భూములను గతంలో అభివృద్ధి పనుల కోసం ముడా సేకరించిందని, దీనికి ప్రతిఫలంగా ఖరీదైన స్థలాలను సిద్ధరామయ్య ఫ్యామిలీ దక్కించుకుందన్న ఆరోపణలు ఉన్నాయి. విచారణ జరపాలంటూ బీజేపీ సహా ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలో సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ సీఎం సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించగా తాత్కాలిక ఊరట లభించింది.
గవర్నర్, బీజేపీ, జేడీఎస్ కుట్ర: సిద్ధరామయ్య
తన జీవితం తెరిచిన పుస్తకమని, తాను ఎలాంటి తప్పు చేయలేదని కర్నాటక సీఎం సిద్ధరామయ్యఅన్నారు. ‘‘నాకు న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఇన్నేండ్ల నా రాజకీయ జీవితంతో ఒక్క మచ్చ కూడా లేదు. రాజ్భవన్, బీజేపీ, జేడీఎస్ కలిసి నాపై కుట్ర చేస్తున్నాయి. నా ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయినా భయపడను” అని ఆయన మీడియాతో చెప్పారు. గవర్నర్ ఇచ్చిన ఆదేశాల వెనుక రాజకీయ ప్రోద్బలం ఉందని, దీనిపై లీగల్గా పోరాటం చేస్తానని సిద్ధరామయ్య స్పష్టం చేశారు.