ఖాట్మండు: నేపాల్లోని పశ్చిమ ప్రాంతంలో 24 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతిచెందారు. ఆదివారం రాత్రి బజాంగ్ జిల్లా బంగల్ మునిసిపాలిటీ వద్ద కొండచరియలు విరిగిపడి ఒక కుటుంబంలోని నలుగురు సజీవ సమాధి అయ్యారు. సోమవారం తెల్లవారుజామున జాజర్కోట్ జిల్లాలో నల్గాడ్ మున్సిపాలిటీ–-2లోని మజాగాన్లో కొండచరియలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. గత నెలలో చిట్వాన్ జిల్లాలోని నారాయణ్ఘాట్–ముగ్లింగ్ హైవేపై సిమల్తాల్ ప్రాంతంలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి ఏడుగురు భారతీయులు సహా 65 మంది ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులు నదిలో కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే.