జమ్మూలో రెండోదశ పోలింగ్ ప్రశాతం..ఉత్సాహంగా ఓట్లేసిన ఓటర్లు

  • ప్రజాస్వామ్యానికి ఇది పండుగ 
  • జమ్మూకాశ్మీర్​లో ఎన్నికలపై సీఈసీ
  • రెండో దశలో 54శాతం పోలింగ్​ 
  • 6 జిల్లాల్లో ఓట్లేసిన జనం
  • బరిలో ఒమర్ అబ్దుల్లా సహా 238 మంది నేతలు

శ్రీనగర్:జమ్మూకాశ్మీర్​లో రెండో దశ పోలింగ్ ​పటిష్ట బందోబస్తు నడుమ బుధవారం ప్రశాంతంగా జరిగింది. మొత్తం 6 జిల్లాల్లో 26 నియోజకవర్గాల్లోని 3,502 పోలింగ్‌‌ కేంద్రాల్లో ఓటింగ్‌‌ నిర్వహించారు. 13 వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. పీర్​పంజాల్​పర్వత శ్రేణికి ఇరువైపులా ఉన్న శ్రీనగర్, బడ్‌‌గామ్, రాజౌరీ, పూంఛ్, గందర్బల్, రియాసీ జిల్లాల్లోని 26 స్థానాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్​.. సాయంత్రం 6 గంటల వరకు సాగింది. 

ప్రజలు క్యూలైన్లో నిల్చొని, ఓటుహక్కును వినియోగించుకున్నారు. మొత్తం 54% ఓటింగ్​నమోదైనట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. ఓటేయడానికి క్యూలలో నిలబడ్డ జనాన్ని చూస్తుంటే ప్రజాస్వామ్యానికి ఇది పండుగలా అనిపిస్తోందంటూ సీఈసీ రాజీవ్​ కుమార్ కామెంట్ చేశారు. 

కాగా, ఈ రెండో ఫేజ్​లో మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, బీజేపీ జమ్మూ కాశ్మీర్​ చీఫ్​ రవీందర్​రైనా, పీసీసీ అధ్యక్షుడు తారిఖ్​హమీద్​ కర్రాసహా 238 మంది నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వచ్చే నెల ఒకటిన మిగతా 40 స్థానాలకు చివరి విడత ఎన్నికలు జరుగనున్నాయి.  అక్టోబర్​ 8న  ఫలితాలు విడుదల కాను న్నాయి.

ఎన్నికల ప్రక్రియ పరిశీలించిన విదేశీ ప్రతినిధులు

జమ్మూకాశ్మీర్​లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలను పరిశీలించేందుకు 15 మంది విదేశీ ప్రతినిధులు వచ్చారు. అమెరికా ​డిప్యూటీ చీఫ్​ ఆఫ్​ మిషన్ ​జోర్గాన్ ఆండ్రూస్​నేతృత్వంలో విదేశీ మంత్రిత్వశాఖకు చెందిన ఆరుగురు అధికారులతో కలిసి ప్రతినిధి బృందం ఉదయం 10 గంటలకు శ్రీనగర్​కు చేరుకున్నది.

 ఈ బృందంలో అమెరికాతోపాటు ఈయూ, సౌత్​కొరియా, స్పెయిన్, సోమాలియా, పనామా, నైజీరియా, సౌత్​ఆఫ్రికా, నార్వే, రువాండా, ఫిలిప్పీన్స్​, మెక్సికో, సింగపూర్, టాంజానియా ప్రతినిధులున్నారు. 

శ్రీనగర్, బుద్గాం జిల్లాలోని పోలింగ్​ స్టేషన్లను సందర్శించారు. ఓటర్లతో ముచ్చటించారు. ఎన్నికల ఏర్పాట్లపై ఈ బృందం సంతృప్తి వ్యక్తం చేసినట్టు సీనియర్ ​అధికారి తెలిపారు. మరో రెండ్రోజులు వివిధ చోట్ల పర్యటించనున్నారు.

ఈ ఎన్నికలు ఓ చరిత్ర

జమ్మూకాశ్మీర్​లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు చరిత్రను సృష్టిస్తున్నాయని చీఫ్​ఎలక్షన్ కమిషనర్(సీఈసీ) రాజీవ్​కుమార్​ తెలిపారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఎక్కడైతే ఎన్నికలను బహిష్కరించారో..అదేచోట ఇప్పుడు ప్రజలు పెద్ద సంఖ్యలో క్యూలైన్లో నిల్చొని, తమ ఓటుహక్కును వినియోగించుకుం టున్నారని చెప్పారు. యువత, మహిళ లు, సీనియర్ ​సిటిజన్లు కూడా ఓటేసేందు కు ఓపికతో క్యూలైన్లో నిల్చొన్నారని చెప్పారు. ఇది ప్రజాస్వామ్యా నికి పండుగ రోజు  అని అభివర్ణించారు.