- వంద డ్రోన్లు, వంద మిసైళ్లతో అటాక్
- పవర్ ప్లాంట్లు, ఆయిల్ రిఫైనరీలే లక్ష్యం
- ముగ్గురు ఉక్రెయిన్ పౌరులు మృతి
- భారీ పేలుళ్లతో భయాందోళనలో ప్రజలు
- రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ అటాక్
కీవ్: రష్యా, ఉక్రెయిన్ మధ్య మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఉక్రెయిన్పై రష్యా సోమవారం డ్రోన్లు, మిస్సైల్స్తో భీకర దాడికి దిగింది. ఇంధన మౌలిక వసతులే లక్ష్యంగా వంద డ్రోన్లు, వంద క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడిలో ముగ్గురు ఉక్రెయిన్పౌరులు మృతిచెందారు. పశ్చిమ లుట్స్క్, తూర్పు డ్నిప్రో, దక్షిణ జపోరిజ్జియా ప్రాంతాల్లో ఈ మరణాలు నమోదయ్యాయి.
లుట్స్క్ నగరంలో ఒక అపార్ట్మెంట్ దెబ్బతిన్నది. ఆదివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన దాడి.. సోమవారం మధ్యాహ్నం వరకు కొనసాగింది. బాంబు పేలుళ్ల చప్పుళ్లతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కాగా, ఈ దాడిని ఉక్రెయిన్ కూడాధ్రువీకరించింది.
పవర్, వాటర్సప్లైకి అంతరాయం
క్రూయిజ్, బాలిస్టిక్ మిస్సైల్స్ దాడి తర్వాత ఉక్రెయిన్ తూర్పు, ఉత్తర, దక్షిణ, మధ్య ప్రాంతాలపై అనేక రకాల డ్రోన్లు విరుచుకుపడ్డాయని ఉక్రెయిన్ ఎయిర్ఫోర్స్ తెలిపింది. కీవ్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయని పేర్కొన్నది. ఈ దాడితో విద్యుత్, నీటి సరఫరాకు అంతరాయం కలిగిందని కీవ్ మేయర్ చెప్పారు.ఈ నేపథ్యంలో ప్రజలు ఆశ్రయం పొందేందుకు ఇప్పటికే ఏర్పాటు చేసిన షెల్టర్ టైప్ ఇన్విన్సిబిలిటీ పాయింట్లను ఓపెన్ చేస్తున్నట్టు వివరించారు.
సాయం చేయండి: జెలెన్స్కీ
తమ దేశంపైకి రష్యా వదులుతున్న డ్రోన్లు, క్షిపణులను కూల్చేసేందుకు సాయం చేయాలని యురోపియన్ దేశాలను ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ అభ్యర్థించారు. ఈమేరకు ఓ వీడియో సందేశం రిలీజ్ చేశారు. ‘‘ఈ ఉదయం నుంచి దాదాపు 100కు పైగా డ్రోన్లు, 100 మిస్సైల్స్తో రష్యా దాడి చేస్తున్నది. ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడుతున్నది. ఈ దాడిలో ప్రాణనష్టం కూడా జరిగింది. చాలాచోట్ల విద్యుత్, నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
మా బలగాలు దాడిని అడ్డుకుంటున్నాయి” అని పేర్కొన్నారు. ‘‘యురోపియన్ దేశాలు ఎయిర్ డిఫెన్స్కు సహకారం అందిస్తే ఇంకా ఎన్నో ప్రాణాలను కాపాడగలం. మిడిల్ఈస్ట్లో దేశాలు ఐకమత్యంగా కలిసి పనిచేసినప్పుడు.. మన యురోపియన్లో ఎందుకు పనిచేయకూడదు? ఎక్కడైనా ప్రాణం ఒక్కటే కదా? ” అని వ్యాఖ్యానించారు.
రష్యాపైకి ఉక్రెయిన్ డ్రోన్లు
ఉక్రెయిన్పై రష్యా విరుచుకుపడ్డ సమయంలోనే తమ దేశంపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసిందని రష్యా తెలిపింది. ఈ దాడిలో సరటోవ్ రీజియన్లో నలుగురు గాయపడ్డట్టు పేర్కొన్నది. ఎంగెల్స్నగరంలోని ఓ బిల్డింగ్పై కూడా దాడి జరిగినట్టు తెలిపింది. ఈ బిల్డింగ్పై ఇంతకుముందు కూడా దాడి జరిగిందని, ఇందులో మిలిటరీ ఎయిర్ఫీల్డ్ ఉందని పేర్కొన్నది.
ఆదివారం రాత్రిపూట నుంచి సోమవారం ఉదయం వరకు రష్యాలోని సరటోవ్, యారోస్లావల్ ప్రాంతాలతో సహా 8 రష్యన్ ప్రాంతాలపై మొత్తం 22 ఉక్రేనియన్ డ్రోన్లను తాము అడ్డుకున్నామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి.