- అప్పటి బీజేపీ ప్రభుత్వం నా మాట వినలేదు: ఫరూక్ అబ్దుల్లా
శ్రీనగర్: 25 ఏండ్ల క్రితం ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం ఐసీ 814 హైజాక్ అయినప్పుడు.. అందులోని బందీలను విడిపించేందుకు బదులుగా ముగ్గురు టెర్రరిస్టులను విడుదల చేయొద్దని కేంద్రంలోని అప్పటి బీజేపీ ప్రభుత్వానికి చెప్పానని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. కానీ, వారు తన మాట వినలేదని ఆయన పేర్కొన్నారు. గురువారం శ్రీనగర్లో ఓ జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఈ అంశాన్ని ప్రస్తావించారు.
బీజేపీ నేతలు తప్పుల మీద తప్పులు చేస్తూ.. మళ్లీ దేశాన్ని బలోపేతం చేస్తున్నామని చెప్పుకుంటున్నారని ఆయన విమర్శించారు. డిసెంబరు 24, 1999న నేపాల్రాజధాని ఖాట్మండు నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఐసీ 814 విమానం గంటలోపే హైజాక్ కు గురైంది. హైజాకర్ల డిమాండ్ మేరకు.. అప్పటి కేంద్ర ప్రభుత్వం మౌలానా మసూద్ అజార్, అహ్మద్ ఒమర్ సయీద్ షేక్, ముస్తాక్ అహ్మద్ జర్గార్ ను విడుదల చేసింది.
ఆ ఘటన జరిగిన సమయంలో ఫరూక్ అబ్దుల్లా అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు ఆ ముగ్గురు టెర్రరిస్టులను విడుదల చేయడం ద్వారా దాని ఫలితాన్ని ఇప్పుడు చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. నేటికీ తీవ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.