జీవించే హక్కుకు భంగం కలిగించవద్దు: బాంబే హైకోర్టు

  • పీఎంఎల్​ఏ రూల్స్ ​పేరుతో ..జీవించే హక్కును దెబ్బతీయొద్దు

  • ట్రయల్​ పేరిట వృద్ధుడ్ని ఎన్నిరోజులు జైల్లో ఉంచుతారు?

  • ఈడీని ప్రశ్నించిన బాంబే హైకోర్టు

ముంబై: ప్రివెన్షన్​ ఆఫ్​ మనీలాండరింగ్​ యాక్ట్​ (పీఎంఎల్​ఏ)లోని కఠిన నిబంధనలు వ్యక్తి జీవించే ప్రాథమిక హక్కును కాలరాసే విధంగా ఉండకూడదని.. సదరు వ్యక్తి వయసు, కండిషన్​ను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని బాంబే హైకోర్టు అభిప్రాయపడింది. 71 ఏండ్ల వృద్ధుడ్ని మనీలాండరింగ్​ కింద అరెస్ట్​ చేసి ట్రయల్​ పేరిట ఎన్నిరోజులు జైల్లో ఉంచుతారని ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ను ప్రశ్నించింది. 

బ్యాంకు లావాదేవీల స్కామ్​ కేసులో పుణెకు చెందిన సూర్యాజీ జాదవ్​ అనే వృద్ధుడ్ని  2021 మార్చిలో ఈడీ అదుపులోకి తీసుకుంది.  తనకు బెయిల్​ మంజూరు చేయాలని, తనకు 71 ఏండ్ల వయసని, క్యాన్సర్​తో బాధపడుతున్నట్లు బాంబే హైకోర్టులో జాదవ్ పిటిషన్​ వేశారు.

 విచారణ జరిపిన హైకోర్టు.. “పిటిషనర్​ను విచారణ పేరిట ఇప్పటికే గరిష్ట శిక్షలో సగం శిక్ష అనుభవించాడు. ఇంకా ఎన్నాళ్లు విచారణ జరపుతారు? అతడి వయసు, ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్​ మంజూరు చేస్తున్నం. పీఎంఎల్​ఏలోని రూల్స్​ రాజ్యాంగంలోని ఆర్టికల్​ 21 ప్రకారం వ్యక్తి జీవించే ప్రాథమిక హక్కును భంగం కలిగించేలా ఉండకూడదు” అని పేర్కొంది.  జాదవ్​కు బెయిల్​ మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయగా.. ఆ కాపీ  శనివారం బయటకు వచ్చింది.