ఒకే ట్రాక్ పైకి.. ఎదురెదురుగా వచ్చిన రైళ్లు : తప్పిన అతి పెద్ద ప్రమాదం

ఒకే ట్రాక్​ పై  2 రైళ్లు ఎదురెదురుగా వచ్చిన సంఘటన పశ్చిమబెంగాల్​ పరిధిలో సిలిగురిలో  చోటు చేసుకుంది. న్యూ జల్పైగురి జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి 2.5 కి.మీ దూరంలో ఉన్న సహుడాంగి సమీపంలో రెండు రైళ్లు ఒకే ట్రాక్‌పై కి వచ్చాయి.  ఈ విషయాన్ని గమనించిన ప్రయాణికులు ఆందోళన చెందారు.  సమాచారం అందుకున్న రైల్వే అధికారులు రెండు రైళ్లను నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.  సిగ్నల్​ వైఫల్యం కారణంగా ఒకే ట్రాక్​పైకి రెండు ట్రైన్లు వచ్చాయని రైల్వే అధికారులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు.  

వేగంగా వెళ్తున్న రైలు సడెన్ గా నిలిచిపోవడంతో రైల్లో ఉన్న ప్రయాణికులంతా ఒక్కసారిగా కిందకు దిగి ఏమైందో చూడటానికి పరుగు తీశారు. దీంతో ఎదురుగా మరో రైలు నిలిచి ఉండటం చూసిన ప్రయాణికులు పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నామని ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ఘటనపై ఇండియన్​ రైల్వేశాఖ విచారణకు ఆదేశించింది. ప్రతి కిలోమీటరుకు ఆటోమేటిక్ సిగ్నలింగ్‌పై ఆధారపడే ఆటోమేటిక్ బ్లాక్ సిస్టమ్‌లో, రైలు ఆగిపోతే రైళ్లు ఒకదాని వెనుక ఒకటి ఆగాలి.ఆటోమేటెడ్ సెక్షన్‌లో రాజధాని కంటే ముందున్న గూడ్స్​  లోకో లోపం కారణంగా ఆగిపోయింది. దీనివల్ల రాజధాని ఎక్స్‌ప్రెస్ కూడా ఆగిపోయింది.  భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసేందుకు  పరిస్థితిని సమీక్షిస్తోందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.