ముచ్చటగా మూడోసారీ కూలిన బ్రిడ్జి

  • బిహార్​లో మళ్లీ కూలిన సుల్తాన్ గంజ్ బ్రిడ్జి

పాట్నా: బిహార్​లో మరో బ్రిడ్జి కూలింది. నిర్మాణంలో ఉన్న సుల్తాన్ గంజ్– అగువానీ ఘాట్ బ్రిడ్జి ఇప్పటికే రెండుసార్లు కూలిపోగా శనివారం  మళ్లీకొంతభాగం కుప్పకూలడం గమనార్హం. బ్రిడ్జి కూలిపోతుండగా స్థానికులు కెమెరాల్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. 

భాగల్ పూర్, ఖగరియా జిల్లాలను కలుపుతూ నాలుగు లేన్లతో 3.16 కి.మీ. మేర బ్రిడ్జి నిర్మాణానికి బిహార్ సర్కారు పూనుకుంది. 2014 ఫిబ్రవరి 23న ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగగా.. ఈ ప్రాజెక్టును దక్కించుకున్న ఎస్ కే సింగ్లా కన్ స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 2015 మార్చి 9న పనులు ప్రారంభించింది. అయితే, ఏళ్లు గడిచినా నిర్మాణం మాత్రం పూర్తికాలేదు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుపై బిహార్ సర్కారు రూ.1710 కోట్లు వెచ్చించింది. 2022 లో వచ్చిన తుఫానుకు కొంతమేర నిర్మించిన బ్రిడ్జి దెబ్బతింది. అదే ఏడాది ఒకసారి, 2023 లో మరోసారి కొంతమేర కూలిపోయింది. 

దీంతో పాట్నా హైకోర్టు కలగజేసుకుని నిర్మాణ పనులు నిలిపేయాలని ఎస్ కే సింగ్లా కంపెనీని ఆదేశించింది. బ్రిడ్జి నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించిందని పేర్కొంటూ అప్పటి వరకూ నిర్మించిన పిల్లర్లు, ఇతర నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశించింది. ప్రస్తుతం కాంట్రాక్టర్ అదే పనిలో ఉన్నాడని ఖగరియా కలెక్టర్ మీడియాకు వెల్లడించారు.