హైదరాబాద్ సిటీ, వెలుగు: ఉల్లిగడ్డ ధరలు పెరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నాఫెడ్ ఆధ్వర్యంలో సబ్సిడీ కింద కిలో రూ.35కి ఉల్లిగడ్డ విక్రయిస్తున్నారు. మంగళవారం నుంచి ఒక మొబైల్ వ్యాన్లో విక్రయాన్ని ప్రారంభించినప్పటికీ.. బుధవారం నుంచి ఐదు వాహనాల్లో విక్రయిస్తున్నారు. బాలానగర్, ఎర్రగడ్డ, కూకట్ పల్లి ప్రాంతాల్లో ఒక్కో వ్యక్తికి కిలో చొప్పున అమ్ముతున్నారు. రెండు రోజుల్లో 20 వాహనాలలో అమ్మకాలు ప్రారంభిస్తామని నాఫెడ్ తెలంగాణ అండ్ ఏపీ స్టేట్ హెడ్ జ్యోతి పాటిల్ తెలిపారు. ఇప్పటి వరకు 5 టన్నుల ఉల్లి అమ్మామని చెప్పారు.
నాఫెడ్ వద్ద 100 టన్నులకి పైనే స్టోరేజీ ఉంద న్నారు. ఉల్లి ధరలు పెరడంతో జనాలకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కేంద్రం రూ.35కే కిలో ఉల్లి అందించాలని నిర్ణయించిందని, ఇప్పటికే మెట్రోపాలిటన్ సిటీల్లో విక్రయాలు ప్రారంభించామని ఆయన తెలిపారు. కాగా.. విదేశాలకు ఉల్లిగడ్డ ఎగుమతులపై పన్ను ఎత్తివేయడంతో ఈ ప్రభావం ఉల్లి ధరలపై పడుతోంది. దీన్ని గుర్తించిన కేంద్రం దాదాపు 5 లక్షల టన్నుల ఉల్లిగడ్డను స్టోరేజీ నుంచి రిలీజ్ చేస్తామని ప్రకటించింది. ప్రస్తుతం బయటి మార్కెట్లో ఉల్లిగడ్డ కిలో రూ.70గా ఉంది.