బెంగళూరు: ఆన్లైన్ గ్రోసరీల డెలివరీ మార్కెట్లో పోటీ ముదురుతోంది. ఫుడ్ డెలివరీ స్టార్టప్ జొమాటో.. ఆన్లైన్ గ్రోసరీ డెలివరీ కంపెనీ గ్రోఫర్స్ను కొనుగోలు చేయనుందని తెలుస్తోంది. ఇందుకోసం జొమాటో ఆల్ స్టాక్స్ డీల్ ద్వారా 750 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.5,711 కోట్లు) చెల్లించనుంది. లాక్డౌన్ కారణంగా ఈ–గ్రోసరీస్కు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో గ్రోఫర్స్కు ఎక్కువ వాల్యుయేషనే దక్కుతుందని మార్కెట్ ఎక్స్పర్టులు చెబుతున్నారు. గ్రోఫర్స్ విలీనమయ్యాక ఏర్పడే కొత్త కంపెనీలో జపాన్ టెక్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ సాఫ్ట్బ్యాంక్ 200 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.1,523 కోట్లు) ఇన్వెస్ట్ చేస్తుందని అంటున్నారు. ఆంట్ ఫైనాన్షియల్కు చెందిన జొమాటో ఇది వరకే ఉబర్ ఈట్స్ను విలీనం చేసుకుంది. తన ఫుడ్ డెలివరీ బిజినెస్ను కన్సాలిడేట్ చేసుకోవడానికి కొన్ని నెలల క్రితం ఉబర్ ఈట్స్ను దక్కించుకుంది. ‘‘ఈ డీల్ విజయవంతమైతే ప్రపంచంలోని ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు సాఫ్ట్బ్యాంక్, ఆంట్ ఫైనాన్షియల్ ఒక్కటవుతాయి. ఇవి ఇది వరకే పేటీఎంలో ఇన్వెస్ట్ చేశాయి. గ్రోఫర్స్ గతంలోనే సాఫ్ట్బ్యాంక్, టైగర్ గ్లోబల్, సికోనియా నుంచి 220 మిలియన్ డాలర్లు సమీకరించింది’’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. లాక్డౌన్ కారణంగా నిత్యావసరాలకు కొరత ఏర్పడటంతో స్విగ్గీ, జొమాటోలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాయి. ఇండ్లకు సరుకులను డెలివరీ చేయడానికి తమ యాప్స్లో స్పెషల్ ఫీచర్లను మొదలుపెట్టాయి. వస్తువుల సరఫరా కోసం స్థానిక కిరాణా స్టోర్లతోపాటు హెచ్ఎయూఎల్, ప్రోక్టర్ అండ్ గ్యాంబిల్, గోద్రెజ్, డాబర్, మారికో, విశాల్ మెగామార్ట్, అదానీ విల్మర్ వంటి ఎఫ్ఎంసీజీలతో డీల్స్ కుదుర్చుకున్నాయి. దాదాపు అన్ని మేజర్ సూపర్ మార్కెట్లు/గ్రోసరీ షాపుల నుంచి కూడా ఇవి సరుకులను డెలివరీ చేస్తున్నాయి. సరుకులతోపాటు మందులనూ ఇంటికి డెలివరీ చేస్తామని స్విగ్గీ తెలిపింది.
