- యూట్యూబ్ కింగ్ ర్యాన్ కాజీ
- 35 బిలియన్లను దాటిన చానెల్ వ్యూస్
న్యూఢిల్లీ: ఎనిమిదేళ్ల వయస్సులో మీరేం చేశారు? ఎవరైనా ఎం చేస్తారు, ఏ ప్రైమరీ స్కూల్లోనో ఆడుతూ ఉండుంటారు. కానీ ఓ పిల్లాడు ఏకంగా రూ. 180 కోట్లకు పైగా సంపాదించాడు! ఎనిమిదేళ్ల పిల్లాడా చాన్సేలేదు అనుకునేరు. ఇది చదవండి కొంచెం.
ర్యాన్ కాజీ తన యూట్యూబ్ చానెల్ ద్వారా 2019 లో ఏకంగా రూ. 184.6 కోట్లను సంపాదించాడు. యూట్యూబ్, ఈ అబ్బాయికి అత్యధికంగా చెల్లిస్తోందని బుధవారం ఫోర్బ్స్ మ్యాగ్జైన్ పేర్కొంది. ఫోర్బ్స్ మ్యాగ్జైన్ విడుదల చేసిన లిస్ట్ ప్రకారం, యూట్యూబ్ ఈ ఏడాది అత్యధికంగా చెల్లించిన చానెల్స్లో ర్యాన్ కాజీ యూట్యూబ్ చానెల్ ముందుంది. అంతేకాదు గతేడాది కూడా ఈ అబ్బాయి యూట్యూబ్ చానలే రూ. 156.2 కోట్ల సంపాదనతో మొదటి స్థానంలో నిలిచింది. ‘ర్యాన్ టాయ్స్ రివ్యూ’ పేరుతో ఈ అబ్బాయి తల్లిదండ్రులు 2015 ఓ యూట్యూబ్ చానెల్ను ప్రారంభించారు. మూడేళ్ల కాలంలోనే ఈ చానెల్ 22.9 మిలియన్ సబ్స్క్రయిబర్లను సాధించింది. ప్రస్తుతం ఈ చానెల్ పేరును ‘ర్యాన్ వరల్డ్’ మార్చారు.
పిల్లలు బాక్స్లను ఓపెన్ చేసి టాయ్స్తో ఆడుకుంటున్న వీడియోలను ఈ చానెల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటారు. ఈ చానెల్లోని చాలా వీడియోలు ఒక బిలియన్ వ్యూస్ను దాటేశాయి. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఈ చానెల్ వ్యూస్ 35 బిలియన్లను దాటిందని వెబ్సైట్ సోషియల్ బ్లేడ్ డేటా తెలిపింది. ఏ ఏ వీడియోలకు స్పాన్సరింగ్ ఉందో చానెల్ చెప్పడం లేదంటూ ట్రూత్ ఇన్ అడ్వర్టయిజింగ్ కన్జూమర్ సంస్థ యూఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్కు(ఎఫ్టీసీ) ఫిర్యాదు చేయడంతో ఈ చానెల్ పేరును ర్యాన్ వరల్డ్గా మార్చారు.
సంపాదనలో ‘డ్యూడ్ పర్ఫెక్ట్’ చానెల్ను ‘ర్యాన్ వరల్డ్’ దాటేసింది. డ్యూడ్ పర్పెక్ట్ను టెక్సాస్కు చెందిన కొంత మంది ప్రెండ్స్ ప్రారంభించారు. ఇందులో హెలీక్యాప్టర్ నుంచి బాస్కెట్బాల్ను హూప్లో వేయడం వంటి అసాధ్యమైన ఫీట్స్ను చేసే వీడియోలను అప్లోడ్ చేస్తుంటారు. ఈ ఏడాది ఈ చానెల్ రూ. 142 కోట్ల సంపాదనతో రెండవ స్థానంలో నిలిచింది. గతేడాది ఈ చానెల్ సంపాదనలో మూడవ స్థానంలో ఉంది.
రష్యాకు చెందిన ఐదేళ్ల అనస్థాసియా రాడ్జిన్స్కయా రూ. 127.8 కోట్ల సంపాదనతో మూడవ స్థానాన్ని సంపాదించుకుంది. ఆమె చానెల్స్ ‘లైక్ నాస్ట్యా వ్లోగ్’, ‘ఫన్నీ స్టేసీ’ మొత్తంగా 70 మిలియన్ సబ్స్క్రయిబర్లను సాధించాయి. ఈ చానెల్లో వీడియోలు రష్యన్, ఇంగ్లిష్, స్పానిస్ భాషలలో అందుబాటులో ఉన్నాయి. యూట్యూబ్ను వినియోగిస్తున్న చిన్న పిల్లల వ్యక్తిగత డేటాను, యూట్యూబ్ పేరెంట్ కంపెనీ గూగుల్ వారికి తెలియకుండా సేకరిస్తోందని ఎఫ్టీసీ గతంలో ఆరోపించింది. గూగుల్ ఈ ఉదంతంలో రూ. 1,207 కోట్ల ఫైన్ కూడా కట్టాల్సి వచ్చింది. ఈ డేటా వలన ఎడ్వర్టయిజర్లు చిన్నపిల్లలను కూడా టార్గెట్ చేస్తారని ఎఫ్టీసీ అభిప్రాయపడింది.
for more news….
