జనవరి–మే లోభారీగా పెరిగిన కొత్త డీమాట్ అకౌంట్లు
ఇన్ఫోసిస్, రిలయన్స్ వంటి పెద్ద షేర్లకే మొగ్గు
ఎస్ఎంఎస్ టిప్లు, స్మాల్, పెన్నీ స్టాకులకుదూరం..
జెరోధా ఫౌండర్ నిఖిల్ కామత్
న్యూఢిల్లీ: కరోనా లాక్డౌన్తో ఇండియన్ స్టాక్ మార్కెట్లలో రిటైల్ ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్ పెరిగింది. మార్కెట్లు భారీగా క్రాష్ అవ్వడంతో దీని నుంచి లాభాలు పొందేందుకు ఇన్వెస్టర్లు తమ టైమ్ను వాడుకున్నారు. వడ్డీ రేట్లు తగ్గడంతో కొంత మంది, ఈక్విటీలలో ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి మరికొంత మంది ఇలా లాక్డౌన్ టైమ్ను ఇండియన్ రిటైల్ ఇన్వెస్టర్లు బాగానే వాడుకున్నట్టు కనిపిస్తోంది. డీమాట్ అకౌంట్లను ఓపెన్ చేయడం లాక్డౌన్ టైమ్లో భారీగా పెరిగిందని బ్రోకరేజి సంస్థలు పేర్కొంటున్నాయి. గతేడాది మొత్తం కంటే జనవరి–మే మధ్య కాలంలో తమ క్లయింట్ గ్రోత్ రేటు ఎక్కువగా ఉందని ఆన్లైన్ డిస్కౌంట్ బ్రోకింగ్ సంస్ధ జెరోధా ఫౌండర్ నిఖిల్ కామత్ అన్నారు. కొత్తగా జాయిన్ అవుతున్న రిటైల్ ఇన్వెస్టర్ల సగటు వయస్సు 30 ఏళ్లుగా ఉందని చెప్పారు. సగటున రూ. 80,000 ఇన్వెస్ట్ చేస్తున్నారని పేర్కొన్నారు. మార్కెట్లు భారీగా పడిపోవడంతో లార్జ్ క్యాప్ స్టాకులను కొనేందుకే రిటైల్ ఇన్వెస్టర్లు మొగ్గు చూపారని చెప్పారు. ఇది మార్కెట్లకు మంచిదని, రిటైల్ ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్ రానున్న రోజుల్లో మరింత పెరుగుతుందన్నారు. మరోవైపు మ్యూచువల్ ఫండ్స్ సిప్లలోకి జూన్ నెలలో ఇన్ఫ్లోస్ తగ్గాయి. దీంతో ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కాకుండా డైరక్ట్గానే స్టాకులను కొనుగోలు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని తెలుస్తోంది. కరోనా దెబ్బతో రిటైల్ ఇన్వెస్టర్లకు అదనపు సమయం దొరకడం కూడా దీనికి కారణమని నిఖిల్ పేర్కొన్నారు. ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి లార్జ్ క్యాప్ స్టాకుల వైపే కొత్తగా ఎంటర్ అయిన వారు మొగ్గు చూపారని అన్నారు. ‘ఇన్వెస్టర్లు స్మాల్ క్యాప్, పెన్నీ స్టాకులకు, ఎస్ఎంఎస్ టిప్లకు దూరంగా ఉన్నారు. టిప్లిచ్చేవారు ఇన్వెస్టర్ల డబ్బులు పోవడానికే ఎక్కువగా కారణమవుతారు. వీరు మనసులో ఇంకేదో పెట్టుకొని టిప్లు ఇస్తారు. రీసెర్చ్ చేసి లాంగ్ టెర్మ్ కోసం లార్జ్ క్యాప్లలో ఇన్వెస్ట్ చేయాలని మా క్లయింట్లకు సలహాలిస్తుంటాం’ అని నిఖిల్ చెప్పారు. ఈయన అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ట్రూ బీకాన్ను కూడా నిర్వహిస్తున్నారు.
జెరోధా, 5పైసా, అప్స్టాక్స్ వంటి డిస్కౌంట్ బ్రోకరేజిలు ఇండియాలో బాగా పాపులర్ అయ్యాయి. ఈ డిస్కౌంట్ బ్రోకరేజి సెగ్మెంట్లో 30 లక్షల కస్టమర్లు ఉన్నారు. ఇండియాలో కేవలం నాలుగు కోట్ల మంది వరకు మాత్రమే రిటైల్ ఇన్వెస్టర్లున్నారు. ఇది 10 కోట్ల వరకు పెరిగే అవకాశాలున్నాయి. ఆర్థిక సంవత్సరం 2020లో కొత్తగా 49 లక్షల డీమాట్ అకౌంట్లు ఓపెన్ అయ్యాయని సెబీ పేర్కొంది. ఇది కనీసం గత పదేళ్లలో అధికమని తెలిపింది. కాగా ఆర్థిక సంవత్సరం 2019 లో ఓపెన్ అయిన 40 లక్షల కంటే ఇది 22.5 శాతం ఎక్కువ.

