- ‘రియల్ టైమ్ ఎక్స్ప్రెస్ క్రెడిట్ ఫీచర్’ తెచ్చిన స్టేట్ బ్యాంక్
- శాలరీ అకౌంట్ అయితే రూ. 15 వేల మంత్లీ శాలరీకే లోన్ పొందే అవకాశం
- రూ. 35 లక్షల వరకు పర్సనల్ లోన్ ఇస్తున్న బ్యాంక్
న్యూఢిల్లీ: ఆన్లైన్ ద్వారానే వేగంగా లోన్లు ఇచ్చేందుకు రియల్ టైమ్ ఎక్స్ప్రెస్ క్రెడిట్ (ఆర్టీఎక్స్సీ) ఫీచర్ను స్టేట్ బ్యాంక్ యోనో తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ఫిజికల్గా ఎటువంటి డాక్యుమెంట్లను నింపకుండానే రూ. 35 లక్షల వరకు పర్సనల్ లోన్ను తీసుకోవచ్చు. కస్టమర్లు తమ క్రెడిట్ ఎలిజిబిలిటీని ఆర్టీఎక్స్సీ ద్వారా తెలుసుకోవచ్చు. ఆర్టీఎక్స్సీ అందుబాటులోకి తేవడంతో కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఎస్బీఐలో శాలరీ అకౌంట్ ఉన్న ఉద్యోగులు ఇక నుంచి పర్సనల్ లోన్ కోసం బ్యాంక్ బ్రాంచుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని ఎస్బీఐ ఓ స్టేట్మెంట్లో పేర్కొంది.
కస్టమర్లు ఈ ఎక్స్ప్రెస్ క్రెడిట్కు అర్హులో కాదో యోనో యాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఎస్బీఐలో శాలరీ అకౌంట్ ఉండి, నెలకు రూ. 15,000 ఆదాయం సంపాదిస్తున్న ఉద్యోగులు ఎస్బీఐ ఆర్టీఎక్స్సీ ఫెసిలిటీ ద్వారా లోన్ పొందొచ్చు. ఇంకా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ కంపెనీల్లో పనిచేసే వారు, లాభాల్లో నడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వ కంపెనీల్లో పనిచేసేవారు ఈ ఫెసిలిటీ కింద లోన్ పొందొచ్చు. అంతేకాకుండా జాతీయ స్థాయిలో పేరొందిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లలో ఉద్యోగం చేసేవారు, కొన్ని కార్పొరేట్కంపెనీల్లో పనిచేసేవారు ఈ ఫెసిలిటీ కింద లోన్ పొందొచ్చు. ‘ఎటువంటి ఇబ్బంది లేకుండా, మొత్తం ఆన్లైన్లోనే ఎక్స్ప్రెస్ క్రెడిట్ ఫెసిలిటీ ద్వారా కస్టమర్లు లోన్ పొందొచ్చు’ అని ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖారా అన్నారు.
ఇవి కూడా చదవండి
