కోట్లు ఖర్చు చేసినా గంగా ప్రక్షాళన చేయలే

కోట్లు ఖర్చు చేసినా గంగా ప్రక్షాళన చేయలే

గంగా నది ప్రక్షాళన పేరుతో బీజేపీ సర్కారు కోట్ల రూపాయలు వృథా చేసిందని యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్​ అఖిలేశ్ యాదవ్‌ ఆరోపించారు. జౌన్‌పూర్‌‌లోని మల్హనీ బజార్‌‌లో బహిరంగ సభ నిర్వహించింది సమాజ్‌వాదీ పార్టీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీపై ఆరోపణాస్త్రాలు సంధించారు. నిన్న కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్‌‌ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ గంగా నదిలో పవిత్ర స్నానం చేసినా.. సీఎం యోగి చేయలేదని, దీనికి కారణంగా ఆయనకు తెలుసన్నారు. గంగా నది కాలుషితమైపోయి ఉండడం వల్లే సీఎం యోగి నదిలో మునగలేదని అఖిలేశ్ అన్నారు. బీజేపీ ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేసిందని, కానీ గంగా నది ప్రక్షాళన మాత్రం జరగలేదని, గంగా నది ఎప్పటికి స్వచ్ఛంగా మారుతుందని ఆయన ప్రశ్నించారు.

భావోద్వేగాలను బీజేపీ అర్థం చేసుకోలేదు

కాశీ విశ్వనాథ్ కారిడార్‌‌ గురించి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు సిద్ధం కావడం మంచిదేనని, అయితే పేద ప్రజలకు మందులు, ఆక్సిజన్, బెడ్స్ కావాల్సిన సమయంలో బీజేపీ ఆ ప్రజలను అనాథల్లా వదిలేసిందని అఖిలేశ్ ఆరోపించారు. ఈ రోజు తమ సభకు ప్రజల నుంచి వచ్చిన భారీ స్పందన చూస్తే 2022లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమనిపిస్తోందన్నారు. అయితే బీజేపీ ఈ రోజు ప్రారంభాలు చేస్తున్న ప్రాజెక్టుల్లో గత ప్రభుత్వాల పాత్రను కూడా గుర్తించాలని ఆయన అన్నారు. తాము పెట్టుకునే ఎర్ర టోపీలు విప్లవం, భావోద్వేగాలకు సూచిక అని, అలాగే వివాహ దుస్తులు, హనుమాన్‌ పెట్టుకునే సిందూరానికి చిహ్నమని అన్నారు. భావోద్వేగాలను బీజేపీ అర్థం చేసుకోలేదని, ఈ విషయం లఖీంపూర్‌‌ ఖేరీలో రైతులపైకి కారు ఎక్కించిన ఘటనలో ఇన్వెస్టిగేషన్‌ను చూస్తే తేలిపోతుందని అఖిలేశ్ చెప్పారు. రైతులపై దాడి ఘటనలో కేంద్ర మంత్రి, ఆయన కుమారుడు కుట్రదారులని తేలిందని, ఇప్పుడైనా బీజేపీ నేతలు, యూపీ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర మంత్రితో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.