మనీలాండరింగ్ కేసులో యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్ను ముంబై సెషన్స్ కోర్టు.. మార్చి 11 వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీకి అప్పగించింది. యస్ బ్యాంక్ సంక్షోభం నేపథ్యంలో రాణా కపూర్ను దాదాపు 30 గంటల ఇంటరాగేషన్ చేసిన ఈడీ ..ఆదివారం తెల్లవారుజామున అరెస్ట్ చేసింది. మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టం కింద అధికారులు శనివారం రాణా కపూర్ను సుదీర్ఘంగా ప్రశ్నించారు. విచారణకు రాణా కపూర్ సరిగా సహకరించకపోవడంతో ఆయన్ను అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు.
రాణా నేతృత్వంలోని యస్ బ్యాంకు.. DHFL బ్యాంకుకు వేల కోట్ల రుణాలను అప్పుగా ఇచ్చింది. తిరిగి రాబట్టుకోలేని కారణంగా యస్ బ్యాంకు దివాళా తీసింది. DHFL సంస్థకు ఇచ్చిన రుణాలు నిరర్ధక ఆస్తులుగా మార్చాయని, ప్రస్తుతం యస్ బ్యాంక్ సంక్షోభంలో కూరుకుపోవడానికి కారణం రానా కపూరే అని ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు.
కాగా యస్ బ్యాంక్ ఖాతాదారులకు ఊరటగా కస్టమర్లు తమ డెబిట్ కార్డును ఉపయోగించి ఏ బ్యాంకు ఏటీఎంలోనైనా నగదు విత్డ్రా చేసుకోవచ్చని యస్ బ్యాంక్ ట్వీట్ చేసింది. మరోవైపు సంక్షోభంలో కూరుకుపోయిన యస్ బ్యాంక్లో ఎస్బీఐ 49 శాతం వాటాను కొనుగోలు చేయనుంది.
