న్యూఢిల్లీ: ఇండియా మార్కెట్లో చిన్న అప్పులు ఇచ్చేందుకు చైనీస్ స్మార్ట్ఫోన్ దిగ్గజం షియోమి ఎంఐ క్రెడిట్ పేరిట లెండింగ్ సొల్యూషన్ను ప్రవేశ పెట్టింది. ఎంఐ పే తర్వాత తమ నుంచి ఇది రెండో పేమెంట్ సొల్యూషని కంపెనీ తెలిపింది. రూ. లక్ష దాకా పర్సనల్ లోన్స్ను ఎంఐ క్రెడిట్ ఇస్తుందని షియోమి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను జైన్ తెలిపారు. 2023 నాటికి ఇండియాలో ఆన్లైన్ క్రెడిట్ లెండింగ్ మార్కెట్ రూ. 70 లక్షల కోట్లకు చేరుతుందనే అంచనాల నేపథ్యంలో ఈ రంగంలోకి అడుగుపెడుతున్నట్లు పేర్కొన్నారు. దేశంలో 1.9 కోట్ల మంది కస్టమర్లు రూ. 4 లక్షల కోట్ల విలువైన పర్సనల్ లోన్స్ తీసుకున్నారన్న సిబిల్ రిపోర్టును ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. ఈ పర్సనల్ లోన్స్ ఇచ్చేందుకు ఆదిత్య బిర్లా ఫైనాన్స్, మనీ వ్యూ, ఎర్లీ శాలరీ, జెస్ట్మనీ, క్రెడిట్విద్య వంటి నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ఫిన్టెక్ కంపెనీలతో షియోమి జతకట్టినట్లు జైన్ వెల్లడించారు. ఎంఐ ఫోన్ యూజర్లు ఈ యాప్ ద్వారా తమ క్రెడిట్ స్కోర్ను ఉచితంగా పొందే వీలుంటుందని చెప్పారు. ఇండియాలోనే డేటాను భద్రంగా స్టోర్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. పైలట్ మొదలు పెట్టిన తర్వాత నవంబర్ చివరి దాకా సుమారు రూ. 28 కోట్లను అప్పులుగా ఇచ్చినట్లు చెప్పారు. 10 రాష్ట్రాలలో ఎంఐ క్రెడిట్ను అందుబాటులోకి తెచ్చినట్లు జైన్ తెలిపారు.

