- ఇయ్యాల ఢిల్లీలో జాతీయ స్థాయి వర్క్షాప్
- ఈనెల 30 నుంచి అమల్లోకి కొత్త చట్టం
- శ్రీశైలం, సాగర్, పులిచింతల, పెద్దవాగు కేంద్రం పర్యవేక్షణలోకి
- ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన డ్యామ్ భద్రత చట్టం(డ్యామ్సేఫ్టీ యాక్ట్) అమలుకు ముందడుగు పడింది. ఈ చట్టం అమలుపై కేంద్ర జలశక్తి శాఖ గురువారం ఢిల్లీలో జాతీయ స్థాయి వర్క్షాప్ నిర్వహించనుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల ఇరిగేషన్ ఉన్నతాధికారులు ఇందులో పాల్గొననున్నారు. రాష్ట్రం నుంచి ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్, ఈఎన్సీ (జనరల్) మురళీధర్, సీఈ (సీడీవో) శ్రీనివాస్ రావు, ఈఈ రఘునాథ్ శర్మ మీటింగ్లో పాల్గొననున్నారు. దేశంలోని డ్యామ్ల భద్రతపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దిష్టమైన చర్యలు చేపట్టకపోవడంతో కేంద్ర ప్రభుత్వం డ్యామ్ భద్రత చట్టం 2021 తీసుకువచ్చింది. ఈ చట్టం ఈనెల 30వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఇందులో భాగంగా జాతీయ స్థాయిలో డ్యామ్భద్రత కమిటీ, డ్యామ్ భద్రత అథారిటీలు ఏర్పాటు చేశారు. ఈ చట్టాన్ని స్వీకరిస్తూ ఆయా రాష్ట్రాలు.. ఈఎన్సీ ఎక్స్ అఫీషియో చైర్ పర్సన్గా డ్యాం సేఫ్టీ కమిటీని, సీఈ క్యాడర్ అధికారి నేతృత్వంలో స్టేట్ డ్యాం సేఫ్టీ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలున్నాయని ఇరిగేషన్ వర్గాలు చెప్తున్నాయి.
నిర్వహణ, నీటి విడుదల రాష్ట్రాలకే
దేశంలో 5,700 భారీ డ్యామ్లు, రిజర్వాయర్లు ఉన్నాయి. అందులో ఇప్పటి వరకు 42 డ్యామ్లు వరదల ఉధృతి, ఇతర కారణాలతో కొట్టుకుపోయాయి. నిరుడు ఏపీలోని చిత్తూరు జిల్లాలో గల అన్నమాచార్య రిజర్వాయర్ ఇలా కొట్టుకుపోయిన వాటిలో చివరిది. 5,700 భారీ డ్యామ్లలో 80 శాతం వరకు 25 ఏండ్ల కింద నిర్మించినవి కాగా, 227 రిజర్వాయర్లు వందేండ్ల కింద నిర్మించినవిగా గుర్తించారు. మిగతావి 25 ఏండ్లు అంతకన్నా ముందు నిర్మించినవి. తెలంగాణలోని 38 భారీ, మధ్య తరహా ప్రాజెక్టులు, 184 చిన్న డ్యామ్లు దీని పరిధిలోకి తెచ్చారు. మూడు అంశాల ఆధారంగా ఈ చట్టంలోకి తీసుకువచ్చారు. భూమి నుంచి 15 మీటర్ల ఎత్తు, అంతకన్నా ఎక్కువ ఎత్తు కట్ట ఉన్నవి, 500 మీటర్ల పొడవైన క్రెస్ట్ గేట్లు ఉన్నవి, ప్రతి సెకన్కు 2 వేల క్యూబిక్ మీటర్ల నీటిని విడుదల చేసే సామర్థ్యం ఉన్న డ్యాంలను ఈ చట్టం పరిధిలోకి తీసుకువచ్చారు. రాష్ట్రంలోని 19 మంది టెరిటోరియల్ సీఈలు లేదా, ఎస్ఈలను కేంద్ర ప్రభుత్వం ఆయా రిజర్వాయర్లకు యజమానులుగా గుర్తించింది. డ్యామ్లకు ఓనర్లుగా గుర్తించిన అధికారులు ఇకపై డ్యామ్ సేఫ్టీ విషయంలో ప్రతి జాగ్రత్త తీసుకుంటూ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు కృష్ణాపై ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, గోదావరిపై నిర్మించిన పెద్దవాగు ప్రాజెక్టులు కేంద్ర పర్యవేక్షణలోకి వెళ్లనున్నాయి. ఆయా డ్యామ్ల నిర్వహణ, నీటి విడుదల సహా ఇతర అంశాలన్నీ ఎప్పటి లాగే రాష్ట్రం పరిధిలోనే ఉంటాయి. కేవలం ఆయా డ్యామ్ల రక్షణ సంబంధమైన అంశాలు మాత్రమే కేంద్రం పరిధిలోకి వెళ్లనున్నాయి.
