నర్నాల్: కనీస మద్దతు ధరను తొలగిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు. హరియాణాలోని నర్నాల్లో నిర్వహించిన పబ్లిక్ మీటింగ్లో ఖట్టర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల చేస్తున్న నిరసనలు, ఎంఎస్పీ పై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఎంఎస్పీ ఎప్పటికీ కొనసాగుతుంది. ఎవరైనా దాన్ని తొలగించాలని చూస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఎంఎస్పీ ఎప్పటికీ ముగియదు. అది గతంలో ఉంది, ఇప్పుడు ఉంది, భవిష్యత్లోనూ కొనసాగుతుంది. అన్నదాతల సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించాలి. త్వరలో ఈ వివాదానికి తెరదించాలి. కొత్త అగ్రి చట్టాల గురించి రైతులతో మాట్లాడేందుకు కేంద్రం సంసిద్ధంగా ఉంది’ అని ఖట్టర్ పేర్కొన్నారు.
