కరోనావైరస్ వ్యాక్సిన్ ను అత్యవసరంగా వినియోగించే అధికారాన్ని యుఎస్ డ్రగ్ రెగ్యులేటర్, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) అనుమతిచ్చింది. ఆ అనుమతిని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఖండించింది. కరోనా వైరస్ వ్యాక్సిన్ అత్యవసరంగా వినియోగించుకునేలా అనుమతివ్వడాన్ని తప్పుబట్టిన WHO.. ఆ వ్యాక్సిన్ ను వినియోగించడం వల్ల ప్రజలు అనేక అనారోగ్య సమస్యలకు గురికావాల్సి వస్తుందని సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ అన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక ఏజెన్సీలు కరోనా టీకాను అత్యవసర వినియోగానికి మొగ్గుచూపుతున్నట్లు చెప్పిన సైంటిస్ట్ స్వామినాథన్… మూడో దశ ట్రయల్స్ డేటా ఆధారంగా కరోనా వ్యాక్సిన్ ను వినియోగించాలని సూచించారు.
పూర్తి స్థాయిలో హ్యూమన్ ట్రయల్స్ నిర్వహించకుండా వినియోగంలోకి తెస్తే.. ఇతర వ్యాక్సిన్ల ట్రయల్స్ కష్టమవుతుందని స్వామినాథన్ అన్నారు. దీంతో పాటు మూడు దశల్లో వ్యాక్సిన్ ట్రయల్స్ చేయకపోతే.. వాటి సామర్ధ్యం తక్కువగా ఉంటుందని, తద్వారా కరోనా తగ్గకపోగా మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని WHO సైంటిస్ట్ స్వామినాథన్ మీడియా సమావేశంలో వెల్లడించారు.
