న్యూఢిల్లీ: మనదేశంతో సరిహద్దు పంచు కుంటున్న దేశాలు ఇక ఇండియన్ కంపెనీలలో ఇన్వెస్ట్ చేయాలంటే ప్రభుత్వ అనుమతి పొందాల్సిందే! కరోనా దెబ్బతో దేశీయ కంపెనీలు భారీగా నష్టపోతున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితులను ఉపయోగించు కొని చైనా, ఇండియన్ కంపెనీలలో తన వాటాను పెంచు కుంటోంది. ఇండియన్ కంపెనీలను టేకోవర్ చేయడాన్ని ఆపేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇండియాతో భూ సరిహద్దులను పంచుకుంటున్న దేశాల కంపెనీలు లేదా వ్యక్తులు ఇండియన్ కంపెనీలలోఇన్వెస్ట్ చేయాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. ఈ విషయాలను డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీ-పీఐఐటీ) ఓ స్టేట్మెంట్ లో పేర్కొంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ , పాకిస్తాన్ నుంచి వస్తున్న ఇన్వెస్ట్మెంట్లకు మాత్రమే ప్రభుత్వ అనుమతుల అవసరం.కాగా నిషేధం ఉన్న రంగాలకు మినహా మిగిలినసెక్టార్లలో పాలసీలకు అనుగుణంగా ఎఫ్డీ ఐలు ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ తాజా నిర్ణయంతో బంగ్లాదేశ్ , పాకిస్తాన్ దేశాలతో పాటు చైనా, భూటన్,నేపాల్, మయన్మార్ ల నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్లు ప్రభుత్వం నుంచి అనుమతి పొందడం తప్పనిసరి. వీటితో పాటు ఇండియన్ కంపెనీలలో ఇప్పటికే ఉన్న ఎఫ్డీ ఐలు లేదా ఫ్యుచర్ ఎఫ్డీ ఐల ఓనర్షిప్ బదిలీలు ఈ నియంత్రణలు కిందకు వస్తాయని డీపీఐఐటీ పేర్కొంది. ఏప్రిల్ 2000 – డిసెంబర్,2019 మధ్య కాలంలో చైనా నుంచి ఇండియాకు 2.34 బిలియన్ డాలర్ల విలువైన ఎఫ్డీఐలు వచ్చాయి.
