హైదరాబాద్, వెలుగు: అనంత్ యూనివర్సిటీ అహ్మదాబాద్ క్యాంపస్లో క్లయిమేట్ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నట్లు విశాక ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రకటించింది. ఈ ల్యాబ్ ఏర్పాటుకు ఎకో–ఫ్రెండ్లీ విశాక వీనెక్స్ట్ ఫైబర్ సిమెంట్ బోర్డులతో ఫ్యాబ్రికేషన్ చేయనున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా, మొత్తం ల్యాబ్కు అవసరమైన విద్యుత్ను ఇచ్చేలా ఆటమ్ సోలార్ రూఫ్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు వివరించింది.
ఆటమ్ సోలార్ రూఫ్కు విశాక ఇండస్ట్రీస్ పేటెంట్ పొందిన విషయం తెలిసిందే. ‘క్లయిమేట్ ఛేంజ్ ప్రభావం ఉందనే విషయాన్ని కాదనలేము. మన జీవితాలపై ప్రతి రోజూ ఈ ఎఫెక్ట్ పడుతోంది. క్లయిమేట్ ల్యాబ్ ఏర్పాటుకు చొరవ తీసుకున్నందుకు అనంత్ యూనివర్శిటీని అభినందిస్తున్నాను’ అని విశాక ఇండస్ట్రీస్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ వంశీ గడ్డం చెప్పారు. ఎకో ఫ్రెండ్లీ బోర్డులు, సోలార్ రూఫ్ ప్రొడక్టులతో ఈ ప్రాజెక్టులో భాగం కావడం ఆనందం కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు.
సస్టెయినబుల్ బిల్డింగ్ మెటీరియల్స్ రంగంలో విశాక ఇండస్ట్రీస్కు 40 ఏళ్ల అనుభవం ఉందని గుర్తు చేశారు. క్లయిమేట్ ఛేంజ్ ఎఫెక్ట్ ఎక్కువవుతున్న నేపథ్యంలో ఆ రంగంలో స్టడీ, రీసెర్చ్పెరగాల్సిన అవసరంతో పాటు, సస్టెయినబుల్ సొల్యూషన్స్ ఆవశ్యకతా పెరిగిందని అనంత్ యూనివర్శిటీ ప్రతినిధి డా అనునయ చౌబే అన్నారు. అనంత్ క్లయిమేట్ ల్యాబ్ ఆ దిశలో తీసుకున్న చొరవగా పేర్కొన్నారు. ఇక్కడ స్టూడెంట్లు తమ ఐడియాలను ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చని వివరించారు.
