న్యూఢిల్లీ: టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి వారసుడు ఎవరనే దానిపై కొద్దిగా క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం బ్యాటింగ్ కోచ్గా పని చేస్తున్న విక్రమ్ రాథోడ్.. చీఫ్ కోచ్గా బాధ్యతలు తీసుకునే చాన్స్ ఉందని సమాచారం. ఈ మేరకు లార్డ్స్ విజయం తర్వాత బీసీసీఐ పెద్దలు.. రాథోడ్తో చర్చించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి హెడ్ కోచ్ పదవికి చాలా రోజుల నుంచి రాహుల్ ద్రవిడ్ పేరు వినిపించినా.. అతను నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)కే పరిమితం కావాలని నిర్ణయించుకోవడంతో రాథోడ్కు లైన్ క్లియర్ అయినట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి. ఇక టీ20 వరల్డ్కప్ తర్వాత శాస్త్రి కాంట్రాక్ట్ ముగుస్తుంది. మళ్లీ అప్లై చేసే ఉద్దేశం కూడా లేదని ఇప్పటికే అతను సంకేతాలిచ్చాడు. కాబట్టి వీలైనంత త్వరగా కొత్త కోచ్ కోసం బోర్డు అప్లికేషన్స్ను ఆహ్వానించనుంది. రవిశాస్త్రితో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీతోనూ మంచి సంబంధాలు ఉండటం రాథోడ్కు ప్లస్ పాయింట్గా మారింది. టీమ్లో చాలా మందితో కూడా రాథోడ్కు మంచి సంబంధాలున్నాయి.
