ఈ నెల 12 వ తేదీ నుంచి ఇంద్రకీలాద్రి పై అమ్మవారిని ఏడువారాల నగలతో అలంకరించనున్నామని దుర్గగుడి ఈవో ఎంవి.సురేష్ బాబు అన్నారు. ఒక్కో రోజు ఒక్కో రకమైన నగలతో అలంకరణ జరుగుతుందని చెప్పారు. సోమవారము- ముత్యాలు, మంగళవారము- పగడాలు, బుధవారము- పచ్చలు, గురువారము- పుష్యరాగాలు, శుక్రవారము- వజ్రాలు, శనివారము- నీలాలు, ఆదివారము – కెంపులు మరియు పౌర్ణమి రోజున బంగారు కవచం కలిగిన నగలతో అమ్మవారి అలంకరణ జరుగుతుందని తెలిపారు.
ప్రస్తుతం అమ్మవారికి దేవస్ధానంలో రెండు కిరీటాలు ఉన్నాయని, ఓ వజ్రకిరీటం చేయించాలనే ఆలోచనలో ఉన్నామన్నారు ఈవో సురేష్ బాబు. వజ్రకిరీటం కోసమని దాతల నుంచి విరాళాలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ప్రసాదం పోటు, అన్నదానం, కేశ ఖండన శాల నిర్మాణాలకు ఈ నెలాఖరుకు ప్లాన్ పూర్తవుతుందని, త్వరలోనే టెండర్లు పిలిచి పూర్తి చేస్తామని చెప్పారు.


