డీజీపీకి ఫిర్యాదు చేసిన జూడాలు
డీసీపీ జూనియర్ డాక్టర్ చెంప ఛెళ్లుమనిపించిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) బిల్లుకు వ్యతిరేకంగా బుధవారం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎదుట జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో బెంజ్ సర్కిల్ నుంచి రామవరప్పాడు వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. మహానాడు రోడ్డు వద్ద మానవహారం చేపడుతున్న జూడాలను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. స్టూడెంట్లు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో డీసీపీ హర్షవర్ధన్ ఓ జూనియర్ డాక్టర్ కాలర్ పట్టుకుని చెంప ఛెళ్లుమనిపించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమపై పోలీసులు అతిగా ప్రవర్తించారని జూడాలు ధర్నాకు దిగారు. డీసీపీపై చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతం సవాంగ్ కు ఫిర్యాదు చేశారు. పోలీసులు క్షమాపణ చెప్పకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు. ఘటనపై సవాంగ్ విచారణకు ఆదేశించారు.
