- ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు భారం కావద్దు!
- రీజనబుల్గా ఛార్జీలు ఉండేలా చర్యలు
- కీలక రేట్లలో మార్పులేదు..స్వాగతిస్తున్న రియల్టీ కంపెనీలు
- ఇన్ఫ్లేషన్ 5.3 శాతంగా..జీడీపీ గ్రోత్ 9.5 శాతంగా
- ఆర్బీఐ ఎంపీసీ ప్రకటన
న్యూఢిల్లీ: డిజిటల్ ట్రాన్సాక్షన్లను మరింత అఫోర్డబుల్గా మార్చడంపై ఆర్బీఐ పనిచేస్తోంది. ఆన్లైన్లో చేసే ట్రాన్సాక్షన్లపై ఎంత ఛార్జీని వసూలు చేయాలనే అంశంపై త్వరలో ఓ సొల్యూషన్తో వస్తామని ప్రకటించింది. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ ( ఎంపీసీ) మీటింగ్ రిజల్ట్స్ను బుధవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. గత కొన్నేళ్ల నుంచి దేశంలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్నాయని, కానీ, కొన్ని సమస్యలు కూడా లేకపోలేదని ఆయన పేర్కొన్నారు. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, వాలెట్లు, యూపీఐ పేమెంట్లపై వసూలు చేసే ఛార్జీలు రీజనబుల్గా ఉండాలని చెప్పారు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్లపై ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తుండడంతో కస్టమర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. డిజిటల్ పేమెంట్ సర్వీస్లను అందించే కంపెనీలు సర్వీస్ ఛార్జీలను కస్టమర్లు లేదా మర్చెంట్ల నుంచి వసూలు చేస్తుంటాయి. కంపెనీలు వసూలు చేసే ఛార్జీలు రీజనబుల్గా లేకపోతే ఆన్లైన్లో పేమెంట్స్ చేయడానికి జనం వెనకడుగేస్తారని దాస్ అన్నారు.
ఈ సమస్యపై సమగ్రంగా విశ్లేషించేందుకు ఒక డిస్కషన్ పేపర్ను ఇష్యూ చేయాలనుకుంటున్నామని చెప్పారు. వివిధ డిజిటల్ పేమెంట్ విధానాల ద్వారా జరిగే ట్రాన్సాక్షన్లపై ఛార్జీలు ఎలా ఉండాలనేది ఈ పేపర్ చర్చిస్తుంది. కన్వెనియెన్స్ ఫీజు, సర్ఛార్జింగ్ ఫీజు వంటి ఛార్జీలపై ఫీడ్ బ్యాక్ను కూడా ఈ పేపర్ పరిశీలిస్తుందని దాస్ అన్నారు. ఒకవైపు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ను అఫోర్డబుల్గా మార్చడం, మరోవైపు సర్వీస్ ప్రొవైడర్లూ నష్టపోకుండా ఉండేలా చూడడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. రిటైల్ కస్టమర్లు ఫైనాన్షియల్ మార్కెట్లో ఈజీగా ఇన్వెస్ట్ చేసేందుకు రిటైల్ డైరెక్ట్ స్కీమ్ను తీసుకొచ్చామని దాస్ పేర్కొన్నారు. ప్రైమరీ, సెకెండరీ మార్కెట్లో ఇన్వెస్టర్లు ఈజీగా పాల్గొనేలా ఇంటర్నెట్ బ్యాంకింగ్, కార్డు పేమెంట్స్తో పాటు యూపీఐ పేమెంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయని అన్నారు. కాగా, ఐపీఓలకు సబ్స్క్రయిబ్ అవ్వడంలో యూపీఐ పేమెంట్ విధానాన్ని ఇన్వెస్టర్లు వాడడం బాగా పెరిగింది. యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్ చేసుకునే లిమిట్ను రూ. లక్ష నుంచి రూ. 2 లక్షలకు పెంచామని దాస్ గుర్తు చేశారు. ఫీచర్ ఫోన్ యూజర్లు కూడా యూపీఐ పేమెంట్స్ను చేయగలిగేలా కొత్త పేమెంట్ విధానాలను తీసుకొస్తామని పేర్కొన్నారు.
డిజిటల్ కరెన్సీకి ఆన్లైన్ మోసాల గండం..
డిజిటల్ కరెన్సీకి సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫ్రాడ్స్ ప్రధానమైన సమస్యలుగా ఉన్నాయని ఆర్బీఐ పేర్కొంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) (డిజిటల్ రూపాయి) ని తీసుకురావడంపై ఆర్బీఐ పనిచేస్తున్న విషయం తెలిసిందే. ‘రెండు రకాల సీబీడీసీలు ఉంటాయి. అవి హోల్సేల్, రిటైల్ సీబీడీసీలు. మొదటి సెగ్మెంట్లో చాలా వర్క్ పూర్తయ్యింది. కానీ, రెండో సెగ్మెంటే కొద్దిగా కష్టంగా ఉంది. ఈ సెగ్మెంట్లో వర్క్ పూర్తి చేయడానికి టైమ్ పడుతుంది’ అని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టీ. రవి శంకర్ అన్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో డిజిటల్ రూపాయిని పైలెట్ ప్రాజెక్ట్గా లాంచ్ చేయనున్నారు. కొన్నేళ్ల క్రితం వరకు ఫేక్ కరెన్సీ సమస్యలు ఉండేవని, ఇలాంటి సమస్యలే డిజిటల్ రూపాయిలో కూడా ఉంటాయని దాస్ అన్నారు. వీటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
బ్యాంకులకు అనుమతి..
విదేశాల్లో ఉన్న తమ బ్రాంచులకు క్యాపిటల్ అందించడానికి బ్యాంకులు ఇక ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఈ బ్రాంచుల ద్వారా వచ్చే ప్రాఫిట్స్ను తెచ్చుకోవడానికి కూడా ఎటువంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు. బ్యాంకుల దగ్గర అదనంగా ఉన్న లిక్విడిటీని బ్యాలెన్స్ చేసేందుకు వీఆర్ఆర్ఆర్ విధానాన్ని కొనసాగిస్తామని దాస్ అన్నారు. బ్యాంకుల దగ్గర అదనంగా రూ. 9.2 లక్షల కోట్లు ఉన్నాయని అంచనా.
