న్యూఢిల్లీ: యూపీఐ పేమెంట్స్ సిస్టమ్ దూసుకెళ్తోంది. గత నాలుగేళ్లలో యూపీఐ ట్రాన్సాక్షన్లు 70 రెట్లు పెరిగాయని స్టేట్ బ్యాంక్ రిపోర్టు వెల్లడించింది. ఇందులోని వివరాల ప్రకారం.. కేవలం గత నెలలోనే రూ.6.3 లక్షల కోట్ల విలువైన 3,500 కోట్ల ట్రాన్సాక్షన్లు జరిగాయి. 2020 అక్టోబరుతో పోలిస్తే యూపీఐ ట్రాన్సాక్షన్ల విలువ 103 శాతం పెరిగింది. దీంతో డెబిట్/క్రెడిట్కార్డుల ట్రాన్సాక్షన్లు తగ్గుతున్నాయి. వీటితో పోలిస్తే యూపీఐతో డబ్బు చెల్లించడం సులువు కావడమే ఇందుకు కారణం. గత ఏడేళ్లలో యూపీఐ చెల్లింపులు 19 రెట్లు పెరగడంపై ప్రధాని నరేంద్ర మోడీ మెచ్చుకున్నారు. చాలా తక్కువ సమయంలోనే.. ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ ట్రాన్సాక్షన్లు జరుగుతున్న దేశంగా ఇండియా ఎదిగిందని అన్నారు. బ్యాంకింగ్ సిస్టమ్ కూడా 24 గంటలూ సేవలు అందిస్తుండటం ఎంతో సంతోషం కలిగిస్తోందని ప్రధానమంత్రి అన్నారు.
