కర్నూలు: ప్రేమించానని వెంటపడ్డాడు.. కాదంటే మందు తాగి చస్తానని బెదిరించాడు.. అంగీకరిస్తే రెండేళ్లు అన్నిరకాలుగా వాడుకున్నాడు.. తీరా పెళ్లి చేసుకోమంటే మొహం చాటేసి కనిపించకుండా తిరుగుతున్నాడని ఓ యువతి తన ప్రియుడి ఇంటి ముందు దీక్షకు దిగింది. ప్రియుడు కమ్ మేనబావతో తన పెళ్లి జరిపించే వరకు దీక్ష విరమించనంటోంది.
కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం ఊటకొండకు చెందిన ఓ యువతి టీటీసీ చదువుకుంది. కాలేజీకి వెళ్లి వచ్చేటప్పుడు చూసి ప్రేమిస్తున్నానని వెంట పడ్డాడు. రెండో తరగతితోనే బడిమానేసి పొలం పనులు చేసుకుంటున్న మేనమామ కొడుకు సరదాగా ఆటపట్టిస్తున్నాడనుకుంది. అయితే రోజు రోజుకు వ్యవహారం సీరియస్ అయింది. ప్రేమించకుంటే మందు తాగి చస్తానంటే సరేనన్నా.. అంతే మా అమ్మానాన్నలు పనుల కోసం పక్క ఊర్లకు వెళ్లినప్పుడల్లా ఇంటికొచ్చి వేధించాడు. ఎలాగూ కాబోయే భార్యా భర్తలం అంటూ బలవంతం చేశాడు.. నీవు ఒప్పుకోకుంటే మందు తాగిచస్తానంటే లొంగిపోయా. దీంతో అవకాశం దొరికినప్పుడల్లా వాడుకుని.. తీరా పెళ్లి చేసుకోమని అడిగితే.. మొహం చాటేశాడు. గట్టిగా నిలదీస్తే.. నీవు నాపక్కన నిలుచుంటే పొట్టిగా కనిపిస్తావ్.. అంటున్నాడంటూ ప్రియురాలు వెక్కి వెక్కి ఏడుస్తోంది. బావకు నేనంటే ఇష్టమే.. అక్క మాటలు విని పెళ్లికి వద్దంటున్నాడు.. మొదట్లో సరదాగా అన్నమాటలనే నిజం చేస్తూ.. ఊరిలో ఉంటున్నా కనిపించకుండా తిరుగుతున్నాడు. పెళ్లికి మొహం చాటేస్తున్నాడు.. అందుకే మేనత్త ఇంటిముందు దీక్ష చేస్తానంటే.. అందరూ ఊరువెడిచి వెళ్లిపోయారు.. నాకు న్యాయం చేయాలి.. నా బావకు నేనంటే ఇష్టమే.. బావతో నా పెళ్లి జరిపించే వరకు వెళ్లేది లేదంటూ దీక్ష కొనసాగిస్తోంది.

