తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఇవాళ డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతిరోజు జరుగుతున్న దర్శనాల పరిస్థితిని క్లుప్తంగా వివరించారు. టీటీడీ సిబ్బందికి సిమ్టమ్స్ లేకపోయినా టెస్టుల్లో పాజిటివ్ వస్తుండడంతో ముందు జాగ్రత్త చర్యలు తీవ్రం చేశామన్నారు. టిటిడిలో 91 మంది సుబ్బందికి కరోనా సోకినందున ఉద్యోగులకు ఎక్కువ టెస్టులు చేయమని ఆధికారులకు ఆధేశించామన్నారు. ఎస్పీఎఫ్ సిబ్బంది సెలవులపై అనంతపురం, కడప వెళ్ళి రావడం వల్ల కరోనా సోకినట్లు గుర్తించామన్నారు. భక్తుల నుండి ఏమైనా కరోనా వస్తోందా అన్నదానిపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నామని ఈవో చెప్పారు.
దేవుని దయవల్ల ఇప్పటి వరకు టిటిడికి ఎలాంటి ఇబ్బంది లేదు… ఆగస్టు చివరి వరకు సమస్య రాదు.. కార్పస్ ఫండ్ గురించి ఆలోచన లేదు…. ఆగస్టు చివరిలో భోర్డ్ మీటింగ్ లో చర్చించి, సెప్టెంబర్ లో ఇచ్చే ఆగస్ట్ జీతాలపై నిర్ణయం తీసుకుంటామని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. దేశంలో తలనీలాలకు కొరత వల్ల బాగా డిమాండ్ పెరిగింది… గతంలో కంటే సుమారు 8 కోట్లు అదనంగా వచ్చిందన్నారు. టిటిడి ఆస్తులపై వైట్ పేపర్ విడుదలకు టౌమ్ బౌండ్ ఏమీలేదు… ఆస్తుల వివరాలను ఆన్ లైన్ చేసే పనులు జరుగుతున్నాయి…. అన్ని పక్కాగా చేసిన తరువాతే విడుదల చేస్తామని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వివరించారు.
డయల్ యువర్ ఈవో ముఖ్యాంశాలు
కోవిడ్-19 నేపథ్యంలో లాక్డౌన్ సడలించిన తరువాత శ్రీవారి ఆలయంలో భక్తులకు దర్శనం ప్రారంభమైన జూన్ 11వ తేదీ నుండి జూలై 10వ తేదీ వరకు నమోదైన వివరాలు ఇలా ఉన్నాయి.
దర్శనం : ఆన్లైన్ ద్వారా 2,02,346 మంది భక్తులు టికెట్లు బుక్ చేసుకున్నారు. 1,64,742 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 55,669 మంది దర్శనానికి రాలేదు. తిరుపతిలోని కౌంటర్ల ద్వారా 97,216 మంది భక్తులు దర్శన టోకెన్లు పొందారు. 85,434 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 11,782 మంది దర్శనానికి రాలేదు.
హుండీ ఆదాయం : రూ.16.73 కోట్ల హుండీ ఆదాయం భించింది.
లడ్డూ : 13.36 లక్షల శ్రీవారి లడ్డూలను భక్తులకు విక్రయించడం జరిగింది.
కల్యాణకట్ట : మొత్తం 82,563 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 430 మంది క్షురకులు పిపిఇ కిట్లు ధరించి తగిన జాగ్రత్తలు పాటిస్తూ భక్తులకు తలనీలాలు తీస్తున్నారు.
శ్రీవారి ఆయంలో ట్రై ఓజోన్ స్ప్రేయింగ్ సిస్టమ్ : తిరుమల శ్రీవారి ఆలయ మహాద్వారం ముందు స్కానింగ్ సెంటర్ వద్ద, అర్చకులు, ఉద్యోగులు ప్రవేశించే మార్గం వద్ద వ్యాధి కారక క్రిముల నుండి ఎలాంటి హాని కలగకుండా ట్రై ఓజోన్ స్ప్రేయింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశాం. ఇందులోని హైడ్రాక్సిల్ ఫ్రి ర్యాడికల్ ఐయాన్ స్ప్రే చేయడం వల్ల వ్యాధికారక సూక్ష్మక్రిములు నశిస్తాయి.
సప్తగిరి మాసపత్రిక : సప్తగిరి మాసపత్రిక బట్వాడా సందర్భంగా గుంటూరుకు చెందిన ఒక పాఠకుడికి సప్తగిరితో పాటు అన్యమతానికి చెందిన మరో పుస్తకం బట్వాడా అయినట్లు మా దృష్టికి వచ్చింది. టిటిడి ప్రతిష్టను దెబ్బ తీయడానికి కొంత మంది చేసిన చర్యగా భావించి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై పోలీసు విచారణ ప్రారంభమైంది.
కరోనా పరీక్షలు : జూలై 10వ తేదీ వరకు తిరుమలలో 1865 మంది టిటిడి ఉద్యోగులకు, అలిపిరి వద్ద 1,704 మంది టిటిడి ఉద్యోగులకు, 631 మంది భక్తులకు కరోనా పరీక్షలు నిర్వహించాం. తిరుమలలోని టిటిడి ఉద్యోగులకు 91 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తిరుమలలో పనిచేస్తున్న ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం. ఎంప్లాయిస్ క్యాంటీన్లో వారు కోరిన విధంగా మెను సిద్ధం చేశాం. శ్రీవారి దర్శనార్థం వచ్చిన భక్తులకు ఇప్పటివరకు ఎలాంటి ఆరోగ్య సమస్యా రాలేదు. దర్శనానంతరం ఇళ్ళకు వెళ్ళిన అనేక మంది భక్తులతో టిటిడి సిబ్బంది ఫోన్ ద్వారా వారి ఆరోగ్యం గురించి వివరాలు తెలుసుకున్నారు. జూన్ 18 నుండి 24వ తేదీ వరకు మొత్తం 700 మంది భక్తులకు, జూలై 1 నుండి 7వ తేదీ వరకు మొత్తం 1943 మంది భక్తులకు ఫోన్లు చేయగా అందరూ ఆరోగ్యంగా ఉన్నట్లు సమాధానాలిచ్చారు.
