చిత్తూరు జిల్లా: తిరుచానూరు యోగిమల్లవరం శ్రీ సాలిగ్రామ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు నానో టెక్నాలజీ శానిటేషన్ ఛాంబర్ను ఆవిష్కరించారు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆలయ కమిటీ ఈ ఏర్పాటు చేశారు. తొలుత ఆలయ ధర్మకర్త దినేష్ , అర్చకులు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని ఆలయంలోనికి గౌరవప్రదంగా ఆహ్వానించారు. అనంతరం నానో టెక్నాలజీ శానిటేషన్ ను ఆవిష్కరించారు ఎమ్మెల్యే. ఆ తర్వాత స్వామి వారికి పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త.. కరుణాకర్ రెడ్డికి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త దినేష్ మాట్లాడుతూ.. ఈ నానో టెక్నాలజీ శానిటైజేషన్ ఛాంబర్ ను ఇప్పటివరకు ఏ దేవాలయంలోనూ ఏర్పాటు చేయలేదని, మొట్టమొదటిసారిగా యోగిమల్లవరం శ్రీ సాలిగ్రామ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బయటి నుంచి వచ్చే భక్తులు ఎవరైనా ఈ ఛాంబర్ లో ప్రవేశించిన వెంటనే.. కేవలం 10 సెకన్లలో బ్యాక్టీరియాను నిరోధించే సామర్థ్యం ఈ ఛాంబర్ కు ఉంటుందని చెప్పారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు.

