మన స్టూడెంట్లను నిండా ముంచిన మెడికల్ కౌన్సెలింగ్
దారితప్పిన ఓపెన్ మెరిట్ కోటా.. బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్లకు నష్టం
హైదరాబాద్, వెలుగు: ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపులో ఈసారి తెలంగాణ స్టూడెంట్లకు తీవ్ర అన్యాయం జరిగింది. ఏపీ ఆ రాష్ట్రంలో స్టూడెంట్లకు అన్యాయం జరగకుండా జాగ్రత్తపడితే.. మన సర్కారు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఏపీలో రూల్స్మార్చడంతో అక్కడి స్టూడెంట్లకు లాభం జరగ్గా.. తెలంగాణలో పాత పద్ధతిలో కౌన్సెలింగ్ చేపట్టడంతో ఇక్కడి మెడికల్ కాలేజీల్లోనూ ఏపీ వారికే ఎక్కువ సీట్లు వచ్చాయి. తెలంగాణలోని కాలేజీల్లో జాయిన్ అయిన స్టూడెంట్లను కౌన్సెలింగ్కు అనుమతించకుండా.. ఏపీ సర్కారు ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో ఇక్కడ ఏపీ స్టూడెంట్లు కూడా పాల్గొనేందుకు వీలుగా.. మన ప్రభుత్వం కౌన్సెలింగ్లో అక్రమాలకు డోర్లు తెరిచింది.
ఓపెన్ కేటగిరీలో ఇలా..
ఏపీలో ఓపెన్ కేటగిరీ సీట్లను మెరిట్ ఆధారంగానే కేటాయించారు. మెరిట్ ర్యాంకులు వచ్చిన బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్లకు ఓపెన్ కేటగిరీలో సీట్లు వచ్చాయి. మన దగ్గర మెరిట్ ర్యాంకులు సాధించిన స్టూడెంట్లకు రిజర్వేషన్ కేటగిరీల్లో సీట్లు కేటాయించారు. అక్కడ ప్రతి రౌండ్లో తొలుత ఓపెన్ కేటగిరీ సీట్లు భర్తీ చేసి తర్వాత రిజర్వేషన్ సీట్లు భర్తీ చేశారు. మన రాష్ట్రంలో సెకండ్ ఫేజ్లో తొలుత రిజర్వేషన్ సీట్లు భర్తీ చేసి.. తర్వాత ఓపెన్ కేటగిరీ నింపారు. ఇలా చేయడం వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన స్టూడెంట్లకు ఓపెన్ కేటగిరీలో తక్కువ సీట్లు వచ్చాయి. ఉదాహరణకు సెకండ్ ఫేజ్లో 147 ఓపెన్ కేటగిరీ సీట్లను భర్తీ చేయగా అందులో 139 సీట్లు పెద్ద కులాల స్టూడెంట్లకు.. 8 సీట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్లకు దక్కాయి.
ఏపీలో స్టూడెంట్లకు హెల్ప్
ఏపీలో ఎన్టీఆర్ యూనివర్సిటీ, తెలంగాణలో కాళోజీ యూనివర్సిటీ రెండూ నవంబర్ చివరి వారంలో కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించాయి. డిసెంబర్ 31వ తేదీ వరకు ఏపీలో కన్వీనర్ కోటా కింద ఐదు రౌండ్ల కౌన్సెలింగ్ నిర్వహించారు. మన దగ్గర మాత్రం మూడు రౌండ్లు మాత్రమే నిర్వహించారు.
మళ్లీ..మళ్లీ అదే తప్పు..
ఏపీలో ఐదో రౌండ్ను మాప్ అప్ రౌండ్(చివరి)గా ఎన్టీఆర్ వర్సిటీ ప్రకటించింది. తెలంగాణలోని కాలేజీల్లో చేరిన స్టూడెంట్లు ఎవరినీ ఇందులో పాల్గొనేందుకు అనుమతించలేదు. నాలుగో రౌండ్ తర్వాత మిగిలిన 21 సీట్లను ఐదో రౌండ్లో ఏపీ స్టూడెంట్లకే ఇచ్చారు.
తెలంగాణలో మూడో రౌండ్ను మాప్ అప్(చివరి) రౌండ్గా నిర్వహించారు. రెండో దశ కౌన్సెలింగ్ తర్వాత మిగిలిన 173 సీట్లను భర్తీ చేశారు. అయితే ఈ చివరి రౌండ్కు కూడా ఏపీ స్టూడెంట్లను అనుమతించారు. తెలంగాణ స్టూడెంట్ల కంటే తక్కువ ర్యాంక్ వచ్చిన ఏపీ స్టూడెంట్లకు కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీలో సీట్లు వచ్చాయి. 24 సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోయాయి. వీటిని మేనేజ్మెంట్ కోటాలోకి మార్చేందుకు ప్రయత్నించారు. సీట్ల బ్లాకింగ్ దందా సరికాదంటూ స్టూడెంట్లు ఆందోళన చేశారు.
సీట్ల బ్లాకింగ్ దందాపై స్టూడెంట్ల ఆందోళనతో.. మరో రౌండ్ (అడిషనల్ మాప్ అప్ రౌండ్) కౌన్సెలింగ్కు కాళోజీ వర్సిటీ నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే మళ్లీ ఈ రౌండ్లో కూడా ఏపీ స్టూడెంట్లు పాల్గొనేందుకు చాన్స్ ఇచ్చింది. అంటే ఇందులోనూ ఏపీ స్టూడెంట్లకు సీట్లు దక్కుతాయి. ఈ తీరువల్ల మళ్లీ సీట్లు మిగిలిపోయే అవకాశం ఉంది.
ఏపీలోనూ అడిషనల్ మాప్ అప్ రౌండ్ నిర్వహించాలని నిర్ణయించారు. కానీ దీనికి తెలంగాణ స్టూడెంట్లను అనుమతించడం లేదు. మన దగ్గర మూడో రౌండ్లోనే ఏపీ స్టూడెంట్లను కట్ చేసి ఉంటే.. రెండో రౌండ్ తర్వాత మిగిలిన 173 సీట్లు తెలంగాణ స్టూడెంట్లకే దక్కేవి.
ఏపీలో.. విభజన చట్టం ప్రకారం ఇరు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 15 శాతం సీట్లను అన్ రిజర్వ్డ్ ఓపెన్ కేటగిరీలో భర్తీ చేయాలి. ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ తర్వాత ఏపీలో వందకుపైగా అన్ రిజర్వ్డ్ ఓపెన్ సీట్లు మిగిలాయి. అయితే ఏపీ అధికారులు వెంటనే ఆ సీట్లను మెరిట్ లిస్ట్లో తర్వాత ఉన్న అక్కడి స్టూడెంట్లకే కేటాయించారు.
మన దగ్గర.. ఫస్ట్ ఫేజ్ తర్వాత మిగిలిన అన్రిజర్వ్డ్ ఓపెన్ సీట్లను సెకండ్ ఫేజ్ వరకూ తీసుకొచ్చారు. ఏపీ తరహాలో లోకల్ మెరిట్ స్టూడెంట్లకు ఇవ్వలేదు. దాంతో సెకండ్ ఫేజ్లో ఎవరు ఆప్షన్ ఇచ్చుకుంటే వారికి ఆ సీట్లు వెళ్లిపోయాయి. దీంతో ఎక్కువ సీట్లు ఏపీ స్టూడెంట్లకు వచ్చాయి.
