న్యూఢిల్లీ: రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్హెచ్ఎఫ్ఎల్) నిధులను దుర్వినియోగం చేశాడనే ఆరోపణలపై అనిల్ అంబానీని క్యాపిటల్ మార్కెట్స్ నుంచి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) బ్యాన్ చేసింది. ఈ విషయమై తమ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే సెక్యూరిటీల మార్కెట్లకు దూరంగా ఉండాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు సెబీ హోల్ టైమ్ మెంబర్ ఎస్కే మొహంతి ఆదేశాలు జారీ చేశారు. అనిల్ అంబానీతోపాటు 2018–-19లో కంపెనీలో కీలకస్థానాల్లో పనిచేసిన అమిత్ బాప్నా, రవీంద్ర సుధాకర్, పింకేష్ షాలను క్యాపిటల్ మార్కెట్ల నుంచి నిషేధించినట్లు పేర్కొన్నారు. ప్రమోటర్లు, మేనేజ్మెంట్ ద్వారా ఆర్హెచ్ఎఫ్ఎల్ నిధులను పక్కదారి పట్టించారంటూ అనేక ఫిర్యాదులు అందిన తర్వాత సెబీ ఈ చర్య తీసుకుంది. అనిల్ అంబానీ తన అధికారాలను దుర్వినియోగం చేసి అక్రమంగా లోన్లు మంజూరు చేశారని సెబీ పేర్కొంది. ఖాతా పుస్తకాలను తప్పుగా రాశారని, తప్పుడు స్టేట్మెంట్లను తయారు చేశారని, జనానికి వాస్తవ సమాచారం ఇవ్వలేదని సెబీ విమర్శించింది. ఇదిలా ఉంటే, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఆర్ఇన్ఫ్రా)డిసెంబర్ 31, 2021తో ముగిసిన క్వార్టర్లో రూ. 106.91 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది కాలంలో కంపెనీ రూ. 80.08 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిందని బిఎస్ఈ ఫైలింగ్లో తెలిపింది. ఇదేకాలంలో మొత్తం ఆదాయం రూ.4,010.59 కోట్ల నుంచి రూ.4,281.45 కోట్లకు పెరిగింది. మొత్తం ఖర్చులు రూ.4,950.69 కోట్ల నుంచి రూ.4,828 కోట్లకు తగ్గాయి.
