న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ వెహికల్స్ (ఈవీల) కు డిమాండ్ ఊపందుకోవడంతో వీటి చార్జింగ్ స్టేషన్ల సంఖ్య దేశమంతటా పెరుగుతోంది. కేవలం గత నెల నాలుగు నెలల్లోనే మెగా సిటీల్లో వీటి సంఖ్య రెండున్నర రెట్లు పెరగడమే ఇందుకు ఉదాహరణ. సూరత్, పూణే, అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నైలలో చార్జింగ్ స్టేషన్లు విపరీతంగా పెరిగాయని సెంట్రల్ పవర్ మినిస్ట్రీ తెలిపింది. ఈ 9 నగరాల్లో అక్టోబర్ 2021, జనవరి 2022 మధ్య అదనంగా 678 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటయ్యాయి. మనదేశంలోని 1,640 పబ్లిక్ ఈవీ ఛార్జర్లలో దాదాపు 940 ఈ నగరాల్లోనే ఉన్నాయని మినిస్ట్రీ విడుదల చేసిన రిపోర్టు వెల్లడించింది. చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం మినిస్ట్రీ గత నెల 14న గైడ్లైన్స్ను, స్టాండర్డ్స్ను కూడా ప్రకటించింది. ప్రైవేటు కంపెనీలతోపాటు బీఈఈ, ఈఈఎస్ఎల్, పీజీసీఐఎల్, ఎన్టీపీసీ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలూ ఈ వ్యాపారంలోకి వచ్చేలా ఎన్డీయే ప్రభుత్వం చొరవ తీసుకుంది. మెట్రో సిటీల్లో ఈవీ చార్జింగ్ నెట్వర్క్ బలంగా ఉన్నందున, ఇక మీదట మిగతా సిటీలపై ఫోకస్ చేయాలని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటోంది. సిటీలతోపాటు నేషనల్ హైవేల వెంట 22 వేల చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. వీటిలో10 వేల స్టేషన్లను ఐఓసీ ద్వారా, 7,000 స్టేషన్లు బీపీసీఎల్ ద్వారా, మిగిలిన 5,000 స్టేషన్లు హెచ్పీసీఎల్ ద్వారా ఇన్స్టాల్చేస్తారు. ఐఓసీఎల్ ఇప్పటికే 439 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఇన్స్టాల్ చేసింది. బీపీసీఎల్ 52 ఛార్జింగ్ స్టేషన్లను, హెచ్పీసీఎల్ 382 ఛార్జింగ్ స్టేషన్లను అమర్చింది. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ఇటీవల 25 హైవేలు & ఎక్స్ప్రెస్వేలపై ఏర్పాటు చేయడానికి1,576 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను మంజూరు చేసింది.
బ్యాటరీ శ్వాపింగ్తో ఎన్నో సవాళ్లు
ఈవీ బ్యాటరీలను మార్చుకునే (శ్వాపింగ్) విధానాన్ని ఖరారు చేయడానికి నీతి ఆయోగ్ శుక్రవారం మీటింగ్ పెట్టనుంది. బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ (బాస్)గా తీసుకురావాలని భావిస్తోంది. అయితే ఈ విధానంతో చాలా సమస్యలు వస్తాయని అంటున్నారు. కంపెనీలు రెండు రకాల ఈవీలను అమ్ముతున్నాయి. ఫిక్స్డ్ బ్యాటరీ విధానంలో లేదా రిమూవబుల్ బ్యాటరీ పద్ధతిలో ఈవీని కొనొచ్చు. రిమోవల్ పద్ధతిలో అయితే బ్యాటరీని లీజుకు ఇస్తారు. ఇలాంటి వాళ్లు తమ బ్యాటరీ డిశ్చార్జ్ అయితే దగ్గర్లోనే స్వాపింగ్ స్టేషన్కు వెళ్లి ఫుల్లీ చార్జ్డ్ బ్యాటరీని తీసుకోవచ్చు. బ్యాటరీ శ్వాపింగ్పై 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తారు. ఫిక్స్డ్ బ్యాటరీతో కూడిన ఈవీని కొంటే ఐదుశాతమే జీఎస్టీ ఉంటుంది. బాస్ పద్ధతిలో కొంటే ప్రభుత్వ రాయితీలు కూడా రావు. మనదేశంలో ఇప్పటికీ తగినన్ని శ్వాపింగ్ స్టేషన్లు లేవు. ఈవీ కంపెనీలు ప్రొప్రైటరీ బ్యాటరీ, చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకే ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. అన్ని వెహికల్స్కూ ఒకే రకం బ్యాటరీ వాడకం సరికాదని అంటున్నాయి.
