- 2014లో వీటి సంఖ్య 74 మాత్రమే
- ఇయ్యాల గోవా ఎయిర్పోర్టును ప్రారంభించనున్న మోడీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎయిర్పోర్టుల సంఖ్య భారీగా పెరుగుతోంది. వీటి నిర్మాణానికి మోడీ ప్రభుత్వం చాలా ఇంపార్టెన్స్ ఇస్తోందని కేంద్ర ప్రభుత్వవర్గాలు తెలిపాయి. గోవాలోని మోపా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. 2014 లో ఆయన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి దేశంలోని ఎయిర్పోర్టుల సంఖ్య 74 నుంచి 140కి పెరిగిందని వర్గాలు తెలిపాయి. వచ్చే ఐదేళ్లలో 220 ఎయిర్పోర్టులు అందుబాటులోకి వస్తాయని వెల్లడించాయి. అన్ని నగరాల మధ్య కనెక్టివిటీని పెంచడానికి మోడీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని సంబంధిత ఆఫీసర్ ఒకరు అన్నారు. ఇప్పటి వరకు ఎన్నో ఎయిర్పోర్టులను ప్రారంభించారని అన్నారు. త్వరలో మరిన్ని ఎయిర్పోర్టులకు శంకుస్థాపనలు చేయబోతున్నారని తెలిపారు.
ఈ నవంబర్లో అరుణాచల్ ప్రదేశ్లోని ఇటానగర్లో గ్రీన్ఫీల్డ్ డోనీ పోలో ఎయిర్పోర్టును, జులైలో దేవ్గఢ్ ఎయిర్పోర్టును ప్రారంభించారు. కిందటేడాది నవంబర్లో ఉత్తరప్రదేశ్లోని జేవార్లో నోయిడా ఇంటర్నేషనల్ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. కిందటేడాది అక్టోబర్లో ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రమైన ఖుషినగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును ప్రారంభించారు. మోపా ఇంటర్నేషనల్ విమానాశ్రయానికి శంకుస్థాపన కూడా 2016 నవంబర్లో ప్రధానమంత్రి మోడీయే చేశారు. ఇది గోవాలో రెండవ ఎయిర్పోర్టు. మొదటిది డబోలిమ్లో ఉంది. మోపా ఎయిర్పోర్టుతో పోలిస్తే డబోలిమ్ ఎయిర్పోర్టులో అత్యాధునిక సౌకర్యాలు, టెక్నాలజీ ఉందని అధికారులు తెలిపారు. డబోలిమ్ ఎయిర్పోర్టుకు ప్రస్తుతం 85 లక్షల మంది ప్రయాణీకులకు సేవలు అందించే సామర్థ్యం ఉంది.
