న్యూఢిల్లీ: మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పరీక్షకు అప్పర్ ఏజ్ లిమిట్ ఎత్తేసినట్లు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అధికారులు బుధవారం ప్రకటించారు. ఈ ఏడాది నిర్వహించే నీట్(నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్) యూజీ పరీక్ష నుంచే ఇది అమలులోకి వస్తుందని చెప్పారు. ఇంతకుముందు నీట్ యూజీ పరీక్షకు అప్పర్ ఏజ్ లిమిట్ జనరల్ కేటగిరీ వాళ్లకు 25 ఏండ్లు, రిజర్వేషన్ కేటగిరీ వాళ్లకు 30 ఏండ్లు ఉండేది. అయితే, ఏజ్ లిమిట్ తొలగించాలని నిరుడు అక్టోబర్లో జరిగిన సమావేశంలో ఎన్ఎంసీ నిర్ణయం తీసుకుందని ఆ కమిషన్ సెక్రటరీ డాక్టర్ పులకేశ్ కుమార్ చెప్పారు. దీనిపై ఎన్టీఏకు కూడా లెటర్ రాసినట్లు చెప్పారు.
