యాంట్​గ్రూపుపై నియంత్రణ కోల్పోయిన జాక్​మా

యాంట్​గ్రూపుపై నియంత్రణ కోల్పోయిన జాక్​మా

న్యూఢిల్లీ: బిలియనీర్​ జాక్​ మా చైనీస్​ ఫిన్​టెక్​ కంపెనీ యాంట్​ గ్రూప్​ను ఇక నుంచి కంట్రోల్​ చేయబోరని సంస్థ ప్రకటించింది. షేర్​హోల్డింగ్​లో​ మార్పుల కారణంగా ఆయన ఓటింగ్​ హక్కులు కోల్పోయారని తెలిపింది. రాయిటర్స్ రిపోర్ట్​ ప్రకారం, జాక్​ మా గతంలో యాంట్ వద్ద 50 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ హక్కులు ఉండేవి. మార్పుల వల్ల ఆయన వాటా 6.2శాతానికి పడిపోయింది. 2020లో దాఖలు చేసిన యాంట్  ఐపీఓ పేపర్ ప్రకారం, జాక్​కు యాంట్‌‌లో కేవలం 10శాతం వాటా మాత్రమే ఉంది. అయితే ఆయన రిలేటెడ్​ ఎంటిటీల ద్వారా కంపెనీని కంట్రోల్​ చేసేవారు. యాంట్​లో 50.5 శాతం వాటాలు ఉన్న మరో రెండు సంస్థలను జాక్​మా తన ఇన్వెస్ట్​మెంట్​ వెహికల్​ హాంగ్‌‌జౌ యున్‌‌బో ద్వారా కంట్రోల్ ​చేసేవారు. యాంట్ గ్రూప్ తమ బోర్డులో ఐదవ ఇండిపెండెంట్​ డైరెక్టర్‌‌ని చేర్చుకుంటామని కూడా  ప్రకటించింది. తద్వారా వీరికి కంపెనీ బోర్డులో మెజారిటీ ఉంటుంది. ప్రస్తుతం ఎనిమిది మంది బోర్డు డైరెక్టర్లు ఉన్నారు.  ఫలితంగా  యాంట్ గ్రూప్‌‌పై ఏ ఒక్క వాటాదారుడికీ నియంత్రణ ఉండదు. చైనీస్ రెగ్యులేటర్లు ఈ ఫిన్‌‌టెక్ కంపెనీ తన కన్జూమర్ ​యూనిట్ కోసం 10.5 బిలియన్ యువాన్లను ( 1.5 బిలియన్ డాలర్లు) సమీకరించే ప్రణాళికను ఆమోదించారు.  

ఈ బిలియనీర్​ 2020లో చైనీస్ రెగ్యులేటర్ల/బ్యాంకుల విధానాలను విమర్శించినప్పటి నుంచి ఇబ్బందులు పడుతున్నారు. కొంతకాలం అజ్ఞాతంలో ఉన్నట్టు కూడా వార్తలు వచ్చాయి.  ఆయన స్థాపించిన రెండు కంపెనీలు యాంట్​తోపాటు ఈ–-కామర్స్ గ్రూప్ అలీబాబా  రెగ్యులేటరీ ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. యాంట్  37 బిలియన్ల డాలర్ల ఐపీఓని కూడా చైనా ప్రభుత్వం రద్దు చేసింది. 2021లో యాంటీట్రస్ట్ సమస్యల కారణంగా అలీబాబాకు రికార్డు స్థాయిలో  2.8 బిలియన్​ డాలర్ల జరిమానా విధించింది. ఆలీబాబా సర్వర్ నుంచి దాదాపు వంద కోట్ల మంది డేటా లీక్ అయిందని ఒక హ్యాకర్ చెప్పడంతో  ప్రభుత్వం విచారణ జరిపింది.