న్యూఢిల్లీ: యూఏఈ వేదికగాఈ ఏడాది జరగబోయే ఐపీఎల్ కు ఫ్రాంచైజీలు రెడీ అవుతున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ అనుమతితోపాటు బీసీసీఐ ఆదేశాలు వచ్చిన వెంటనే టీమ్ ను దుబాయ్ పంపేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఈ విషయంలో అందరికంటే ఓ అడుగు ముందుంది.
ఆగస్టు 12వ తేదీలోపు దుబాయ్ వెళ్లాలని చెన్నై జట్టు భావిస్తోంది. ఆగస్టు 15 లోపే ట్రెయినింగ్ క్యాంప్ స్టార్ట్ చేయాలనేది సీఎస్ కే ఆలోచన. ‘ ఆగస్టు 8 కల్లా మొత్తం జట్టును దుబాయ్ చేర్చాలని ప్లాన్ చేస్తున్నాం. అలాగైతేనే మేము అదే నెల రెండో వారం చివర్లో ట్రెయినింగ్ క్యాంప్ మొదలుపెట్టగలం. బీసీసీఐ నుంచి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ ఓపీ) అందిన వెంటనే ట్రావెల్ ప్లాన్ ను ఫైనల్ చేస్తాం. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా టీమ్ ను చార్టెడ్ ఫ్లైట్ లోనే దుబాయ్ తీసుకెళ్లాలని భావిస్తున్నాం ’ అని సీఎస్కే అధికారి ఒకరు పేర్కొన్నారు.
మిగిలిన ఫ్రాంచైజీలు కూడా దుబాయ్ లో ట్రెయినింగ్ క్యాంపులు నిర్వహించాలని చూస్తున్నాయి. సెప్టెం బర్ తొలి వారంలో దాదాపు అన్ని జట్ల ట్రెయినింగ్ షురూ అయ్యే అవకాశం కనిపిస్తోంది. సెప్టెం బర్ 19 నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్ 13వ ఎడిషన్ నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేసింది. వచ్చే ఆదివారం జరిగే జనరల్ కౌన్సిల్ మీటింగ్ తర్వాత ఫుల్ షెడ్యూల్ వెలువడే అవకాశముంది. అంతేకాక ఫ్రాంచైజీలు తీసుకోవాల్సి న జాగ్రత్తలపై ఎస్ ఓపీ కూడా అందజేయనుంది. దీంతో లీగ్ పై ఫ్రాంచైజీలకు పూర్తి క్లారిటీ వస్తుంది.
