ఢిల్లీ: ఫాస్ట్ ట్యాగ్ విధానాన్ని రద్దు చేసి టోల్ వసూళ్లలో కొత్త విధానాన్ని తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ ద్వారా టోల్ ట్యాక్స్ వసూలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ కొత్త విధానాన్ని భారత్ ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టుగా పరీక్షిస్తోంది. శాటిలైట్ ద్వారా వాహన ప్రయాణాన్ని లెక్కించి హైవేలపై ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తే దాన్ని బట్టి ట్యాక్స్ వసూలు చేయనున్నారు. ఐరోపా దేశాల్లో ఈ విధానం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండటంతో భారత్ లోనూ అమలు చేసేందుకు సర్కార్ నిర్ణయించింది. ప్రస్తుత విధానంలో ఒక టోల్ నుంచి మరో టోల్ వరకు వాహనం వెళ్తే..దానికి పన్ను వసూలు చేస్తున్నారు. కానీ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ ద్వారా వాహనం టోల్ చేయబడిన రహదారిలోకి ప్రవేశించగానే పన్ను లెక్కింపు ప్రారంభమవుతుంది. ఈ కొత్త వ్యవస్థను అమలు చేసే కంటే ముందు రవాణా వ్యవస్థను మార్చాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే దీనిపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికి అవసరమైన పాయింట్లను నిపుణులు సిద్ధం చేస్తున్నారు. పైలెట్ ప్రాజెక్టు కింద దేశ వ్యాప్తంగా 1.37 లక్షల వాహనాలను అధికారులు పరీక్షిస్తున్నారు.
