ఓటమి అంచు నుండి గెలుపు అంచువరకు వెళ్లడం గొప్ప థ్రిల్
మనసు పెట్టి చేస్తే ఏదైనా సాధ్యమేనని అడిలైడ్ టెస్టులో నేర్చుకున్నా-కోహ్లి
న్యూఢిల్లీ: 2014 డిసెంబర్ లో అడిలైడ్ వేదికగా ఇండియా – ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ ఎమోషనల్ గా సాగింది. ఆ పోరుకు కొన్ని వారాల ముందు షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్ లో సీన్ అబాట్ వేసిన బౌన్సర్ తగిలి ఆసీస్ బ్యాట్స్ మన్ ఫిల్ హ్యూస్ మృతి చెందాడు. మరోవైపు గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడడంతో ఇండియా కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆ మ్యాచ్ కు రెస్ట్ తీసుకున్నాడు. దాంతో, టీమిండియా ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీ ఫస్ట్ టైమ్ టెస్టు టీమ్ను నడిపించాడు. అదే సిరీస్ మధ్యలో ధోనీ టెస్టులకు గుడ్ బై చెప్పడంతో కోహ్లీ పూర్తి స్థా యి కెప్టెన్ అయ్యాడు. అడిలైడ్ మ్యాచ్ జ్ఞా పకాలను గుర్తు చేసుకున్న విరాట్ అది తమకు స్పెషల్ అన్నాడు. దాని గురించి వివరిస్తూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాడు. ‘ఒక టెస్టు టీమ్గా మేం ఈ రోజు ఈ స్థా యికి చేరుకునే ప్రయాణంలో ఈ టెస్టు మాకెంతో స్పెషల్, ఇంపార్టెంట్. 2014 అడిలైడ్ టెస్టులో రెండు జట్లు అత్యంత ఎమోషనల్ గా ఆడాయి. చూసిన వారికి అద్భుత అనుభూతి కలిగింది. ఈ మ్యాచ్ లో విజయానికి చాలా చేరువగా వచ్చి గెలుపు గీత దాటలేకపోయినా మనసు పెట్టి ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమే అనే విషయాన్ని మాకు ఇది నేర్పించింది. ఎందుకంటే అప్పటిదాకా మొదలు పెట్టడమే అసాధ్యం అనుకున్న దాన్ని (విజయం) మేం దాదాపు అందుకునే వరకూ వచ్చాం. ఒక టెస్టు జట్టుగా మా ప్రయాణంలో ఈ మ్యాచ్ ఎప్పటికీ ఓ మైలురాయిగా నిలిచిపోతుంది’ అని కోహ్లీ రాసుకొచ్చాడు. ఐదు రోజుల పాటు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో కోహ్లీ రెండు ఇన్నింగ్స్ ల్లో నూ సెంచరీ చేశాడు. 364 రన్స్ టార్గెట్ ఛేజింగ్ లో విరాట్ (141) అద్భుతంగా పోరాడినా ఇండియా 315 పరుగులకే ఆలౌటై త్రుటిలో విజయం చేజార్చుకుంది. ఆ సిరీస్లో మన జట్టు 0–2తో ఓడింది. కానీ, నాలుగేళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై టిం పైన్ కెప్టెన్సీలోని కంగారూ టీమ్ ను 2–1తో ఓడించిన కోహ్లీ సేన చరిత్ర సృష్టించింది.


