శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో టీడీపీ ఎన్ఆర్ఐ యశ్ అరెస్ట్..

టీడీపీ ఎన్‌ఆర్ఐ నేత యశ్ బొద్దులూరిని సీఐడీ పోలీసులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. అమెరికా నుంచి వచ్చిన కొద్దిసేపటికే అరెస్ట్ (AP CID Took NRI Yashasvi Into Custody) చేసి మంగళగిరి తరలించారు. అతడిపై లుకౌట్ నోటీసులు ఉన్నట్లు తెలుస్తోంది. అస్వస్థతకు గురైన తల్లిని చూసేందుకు అమెరికా నుంచి వచ్చిన యశ్ శంషాబాద్ లో ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిందని టీడీపీ ఆరోపిస్తోంది.

యశ్ అరెస్ట్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఎన్‌ఆర్ఐ యశ్ బొద్దులూరిని హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో అక్రమ కేసుల్లో అన్యాయంగా అరెస్ట్ చేయడం గురించి తెలిసి షాకయ్యానన్నారు.  ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పే వారి నోరు నొక్కాలని చూస్తున్నారన్నారు. ఓ టెర్రరిస్టులా అతడ్ని విదేశాల నుంచి వచ్చీ రాగానే అరెస్ట్ చేయడం దారుణమన్నారు.

టీడీపీ ఈ అక్రమ అరెస్టుని (TDP condemns NRI supporter's arrest) ఖండిస్తోందని నారా లోకేష్​ అన్నారు.న్యాయమూర్తులను అసభ్య పదజాలంతో దూషించే వైసీపీ నేతలకు పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తూ.. ప్రజాసమస్యలపై స్పందించే ఎన్ఆర్ఐలను మాత్రం వేధింపులకు గురిచేయడం దుర్మార్గమన్నారు.