- 2023–24 లో రూ.19 లక్షల కోట్లు వచ్చే అవకాశం
- సులభంగా మారిన ట్యాక్స్ సిస్టమ్
న్యూఢిల్లీ: గత పదేళ్లలో డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ మూడు రెట్లు పెరిగాయి. ట్యాక్స్ కట్టే వాళ్లు పెరగడంతో 2022–23 లో రూ.16.61 లక్షల కోట్ల పన్ను ఆదాయం వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ నెంబర్ రూ.19 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా. 2013–14 లో రూ.6.38 లక్షల కోట్ల డైరెక్ట్ ట్యాక్స్ ఆదాయం వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నెట్ డైరెక్ట్ ట్యాక్స్లు ( పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్) 20 శాతం (ఇయర్ ఆన్ ఇయర్ ) వృద్ధి చెందాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల రూపంలో నికరంగా రూ.18.23 లక్షల కోట్లు వస్తాయని 2023–24 బడ్జెట్లో కేంద్రం అంచనా వేసింది. మోడీ ప్రభుత్వం గత పదేళ్లలో ట్యాక్స్ సిస్టమ్ను మరింత సింపుల్గా మార్చింది. మినహాయింపులు వదులుకునే కార్పొరేట్ కంపెనీలకు ట్యాక్స్ తగ్గించింది. ఇలాంటి స్కీమ్నే 2020 లో ఇండివిడ్యువల్స్ కోసం తీసుకొచ్చింది. బేసిక్ ట్యాక్స్ మినహాయింపును రూ.3 లక్షలకు పెంచి, స్టాండర్డ్ డిడక్షన్ను రూ. 50 వేలకు పొడిగించి ఈ ట్యాక్స్ సిస్టమ్ మరింత ఆకర్షణీయంగా మార్చింది.
రికార్డ్ లెవెల్లో జీఎస్టీ
మరోవైపు ఇన్డైరెక్ట్ ట్యాక్స్ (జీఎస్టీ) వసూళ్లు కూడా పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్లో రూ.1.87 లక్షల కోట్ల జీఎస్టీ ఆదాయం వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి నెలకు సగటున రూ.1.66 లక్షల కోట్ల జీఎస్టీ ఆదాయం వచ్చింది. మోడీ ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలతో ఫైల్ అయిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ 2021–22 లో 6.37 కోట్లకు పెరిగాయి. 2013–13 లో ఇవి 3.36 కోట్లుగా రికార్డయ్యాయి. ఈ ఏడాదిలో అక్టోబర్ 26 నాటికి 7.41 కోట్ల ఐటీ రిటర్న్స్ ఫైల్ అయ్యాయి.
