ప్రపంచంలో అద్భుతమైన చారిత్రక కట్టడం…ఏడు వింతల్లో ఒకటి తాజ్ మహల్. కరోనా కారణంగా దాదాపు 6 నెలలుగా మూతపడ్డ తాజ్మహల్ ఇవాళ్టి(సోమవారం) నుండి పర్యాటకులకు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు 160 టికెట్లు బుక్ అయ్యాయని పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. తాజ్ మహల్ సందర్శనకు రోజుకు 5వేల మంది పర్యాటలకు మాత్రమే అనుమతిస్తారు.
అంతేకాదు ఆగ్రా కోటను రోజుకు 2,500 మంది మాత్రమే చూసే వీలుంది. రెండు చారిత్రక కట్టడాలను చూడాలనుకునే టూరిస్టులు భారత పురావస్తు శాఖ (ASI) వెబ్సైట్లో టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. తాజ్మహల్, ఆగ్రా కోట దగ్గర ప్రామాణిక నిర్వహణ ప్రక్రియ తప్పక పాటించాలని అధికారులు తెలిపారు. సమాధులు ఉండే గదిలోకి ఒకసారి ఐదుగురిని మాత్రమే అనుమతిస్తారు. అక్కడ షా జహాన్, ముంతాజ్ సమాధులు ఉంటాయి. మ్యూజియం కూడా పర్యాటకుల కోసం తెరిచారు. కట్టడాల దగ్గర తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలి, మాస్కులు ధరించాలి. కట్టడాల గోడలు, రెయిలింగ్స్కి దూరంగా ఉండాలి. షూ కవర్, వాటర్ బాటిల్, టిష్యూ పేపర్ల వంటివి డస్ట్ బిన్లలో మాత్రమే వెయ్యాలి. టూరిస్టులు లోపలికి ఎంటర్ అయ్యే ముందే థెర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. కరోనా లక్షణాలు లేని పర్యాటకుల్ని మాత్రమే లోపలికి అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు.
