- నాలుగు వారాల్లో జవాబు ఇవ్వండి
- ఈసీ, కేంద్రానికి సీజేఐ ఆధ్వర్యంలోని బెంచ్ ఆర్డర్
- బీజేపీ లీడర్ పిల్పై కొనసాగిన విచారణ
న్యూఢిల్లీ: ఎన్నికల సమయంలో ఇచ్చే ఉచిత హామీలు రెగ్యులర్ బడ్జెట్ను మించిపోతున్నాయని సుప్రీం కోర్టు కామెంట్ చేసింది. దేశంలో ఇది చాలా సీరియస్ అంశమని చెప్పింది. ఎన్నికల్లో ఉచిత హామీలు, తాయిలాలు ప్రకటిస్తున్న రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని, సదరు పార్టీల గుర్తును స్తంభింపజేయాలని కోరుతూ దాఖలైన పిల్పై ఏంచెప్తారంటూ కేంద్ర ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్కు నోటీసులు జారీ చేసింది. బీజేపీ లీడర్, లాయర్ అశ్వినీ ఉపాధ్యాయ్ వేసిన ఈ పిల్పై నాలుగు వారాల్లోగా సమాధానమివ్వాలని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హిమా కోహ్లితో కూడిన బెంచ్ మంగళవారం ఆదేశాలిచ్చింది.
ఎట్ల కంట్రోల్ చేస్తరు?
‘‘ఓట్లు రాబట్టుకునేందుకు ప్రకటించే హామీలపై పూర్తిగా నిషేధం విధించండి. ఉచిత హామీలతో రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఇలాంటి వాటిని నియంత్రించేందుకు ఈసీ చర్యలు తీసుకోవాలి” అని పిల్లో కోరారు. ‘‘ఇందుకోసం చట్టం చేయాలి. పార్టీ గుర్తును సీజ్ చేయాలి. రిజిస్ట్రేషన్ను వెనక్కి తీసుకోవాలి. లేదా రెండూ చేయాలి” అని పిటిషనర్ తరఫు లాయర్ వికాస్ సింగ్ చెప్పిన విషయాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంది. ‘‘చూద్దాం.. ప్రస్తుతానికి నోటీసులు జారీ చేస్తాం. దీనిపై సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం, ఈసీకి అవకాశమిస్తాం’’ అని చెప్పింది. ఈ పిల్లో పొలిటికల్ పార్టీలను కూడా ఇంక్లూడ్ చేయాలని ఆదేశాలిచ్చింది. ‘‘మేం కొన్ని లీగల్ ప్రశ్నలు అడుగుతున్నాం. దీన్ని ఎలా కంట్రోల్ చేస్తారు. ఇది చాలా సీరియస్ అంశం. ఇందులో సందేహం అవసరం లేదు. ఉచిత హామీల బడ్జెట్ రెగ్యులర్ బడ్జెట్ను మించి ఉంటోంది. చట్టప్రకారం చూస్తే ఇది అవినీతి కాకపోవచ్చు. కానీ పార్టీలు ఎక్కువ హామీలు ఇస్తే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుంది” అని కోర్టు చెప్పింది.
అన్ని పార్టీలూ అంతే
ఉచిత హామీల అంశంపై గతంలో తాము తీర్పు ఇచ్చిన తర్వాత.. ఎలక్షన్ కమిషన్ కేవలం ఒకే ఒక మీటింగ్ను రాజకీయ పార్టీలతో నిర్వహించినట్లు సుప్రీంకోర్టు ఈ సందర్భంగా గుర్తించింది. ‘‘ఈ అంశంపై గైడ్లైన్స్ రూపొందించాలని గతంలో ఈసీని సుప్రీం ఆదేశించింది. ఈసీ కూడా మార్గదర్శకాలు రూపొందించింది. కానీ అవి పేరుకే ఉన్నయ్” అని పిటిషనర్ తరఫు లాయర్ వికాస్ సింగ్ అన్నారు. ‘‘రాష్ట్రాలు ఇప్పటికే భారీ అప్పుల్లో ఉన్నాయి. అయినప్పటికీ పార్టీలు ‘అవి ఫ్రీ ఇస్తం.. ఇవి ఫ్రీ ఇస్తం’ అని అంటున్నాయి. ప్రతి పార్టీ ఇదే పనిచేస్తోంది. అందుకే ఈ విషయంలో ఒక చట్టం తీసుకురావాలె” అని అభిప్రాయపడ్డారు. ‘‘మరి అన్ని పార్టీలు ఇలాంటి హామీలే ఇస్తున్నప్పుడు.. మీరు రెండు పార్టీల పేర్లనే అఫిడవిట్లో ఎందుకు పేర్కొన్నారు. ఈ విషయంలో మేం గతంలో ఇచ్చిన తీర్పును ఒకసారి చదవండి. నాకో విషయం అర్థం కావడంలేదు. చట్టం.. చట్టం అని మీరు ఎందుకు అంటున్నారు?” అని సీజేఐ ఎన్వీ రమణ ప్రశ్నించారు. దీనికి బదులిచ్చిన లాయర్.. ఎన్నికలకు ముందు పార్టీలు ఇచ్చే ఫ్రీ హామీల కంట్రోల్కు చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఒక పార్టీ ఓటుకు రూ.వెయ్యి ఇస్తే. ఇంకో పార్టీ రూ.2 వేలు ఇస్తోందని చెప్పారు.
