న్యూఢిల్లీ: యెస్ బ్యాంక్లో వాటా కొనేందుకు హీరో కార్పొరేట్ సర్వీసెస్ ఛైర్మన్ సునీల్ ముంజల్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ హేమేంద్ర కొఠారిలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఒక్కొక్కరు 5 నుంచి 10 శాతం దాకా వాటా తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. గత రెండు వారాలుగా ఈ విషయంపై చర్చలు జరుగుతున్నాయని, ఇవి కార్యరూపంలోకి వస్తే యెస్ బ్యాంకు చేతికి రూ. 3,500 కోట్ల మేర నిధులు లభిస్తాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ముంజల్, కొఠారిల ఫ్యామిలీ ఆఫీసుల ద్వారా ఈ పెట్టుబడులు జరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి.
ఐతే, బ్యాంకులలో 5 శాతానికి మించి వాటా తీసుకోవాలంటే ఆర్బీఐ అనుమతి తప్పనిసరి. ముంబైకి చెందిన ఆర్ప్వుడ్ క్యాపిటల్ను బ్యాంకర్ కమ్ అడ్వైజర్గా ఈ డీల్ కోసం కొఠారి ఫ్యామిలీ ఆఫీస్ నియమించుకుంది. ఒక్క యెస్ బ్యాంకే కాకుండా, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, మొబిలిటీ రంగంలోని స్టార్టప్స్లో పెట్టుబడులు పెట్టడానికి ముంజల్ ఉత్సాహం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. మైనారిటీ వాటాదారుగా పెట్టుబడులు పెట్టడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. హీరో మోటోకార్ప్ నుంచి బయటకు వచ్చిన ముంజల్ తన చేతిలోని నిధులను ఇన్వెస్ట్మెంట్స్గా మలచాలని భావిస్తున్నారు. ముంజల్, కొఠారిలే కాకుండా యూఎస్కి చెందిన ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం కార్లైల్ గ్రూపు కూడా యెస్ బ్యాంక్లో వాటా కోసం ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. దాదాపు 400 మిలియన్ డాలర్లను తాజా ఈక్విటీ రూపంలో పెట్టేందుకు కార్లైల్ గ్రూప్ ముందుకు వచ్చినట్లు కూడా ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఐతే, యెస్ బ్యాంక్, కొఠారి ఫ్యామిలీ ఆఫీసు వర్గాలు దీనిపై మాట్లాడటానికి నిరాకరించాయి. హీరో కార్పొరేట్ సర్వీసెస్, కార్లైల్ గ్రూప్లు అసలు సమాధానమే ఇవ్వలేదు.

