న్యూఢిల్లీ: కొత్త సంవత్సరంలో కూడా షేర్లపై ఇండియన్స్కు ఆసక్తి తగ్గదని ఈటీ సర్వే వెల్లడించింది. 2021 లో భారీ లాభాలు చూడడంతో ఈ ఏడాది కూడా షేరు మార్కెట్ బెస్ట్ అసెట్గా కొనసాగుతుందని ఈ సర్వే పేర్కొంది. కానీ, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచుతుండడంతో మార్కెట్లో వొలటాలిటీ ఎక్కువగా ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలని సలహాయిచ్చింది. కొత్త ఏడాది ప్రారంభంలో షేర్లు కొంత తగ్గొచ్చని, కానీ, వచ్చే ఏడాది నిఫ్టీ, సెన్సెక్స్లు కొత్త రికార్డులను క్రియేట్ చేస్తాయని ఈటీ అంచనావేసింది. టెక్నాలజీ, బ్యాంక్స్, కెమికల్స్ షేర్లు ఈ ఏడాది హాట్ఫేవరెట్గా కనిపిస్తున్నాయని మెజార్టీ రెస్పాండెంట్లు పేర్కొన్నారు. మొత్తం 23 ఫండ్ మేనేజర్లు, బ్రోకరేజిల్లో పనిచేసే ఎనలిస్టులు ఈ సర్వేలో పాల్గొన్నారు. వీరిలో 57 % మంది 2022 లో నిఫ్టీ 10–15 % పెరుగుతుందని, 21 % మంది 5–10 % లాభపడుతుందని, కొద్ది మంది15–20 % పెరుగుతుందని పేర్కొన్నారు. 56 % మంది ఈ ఏడాది ప్రారంభంలో నిఫ్టీ 3–-5 % వరకు పడుతుందని చెప్పారు. ఈ ఏడాది డాలర్ మారకంలో రూపాయి 75 దగ్గర ఉంటుందని 44 % మంది అన్నారు.
