హైదరాబాద్ : 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కాశీ వెళ్లే ప్రయాణికులకు సదరన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ కొత్త ఆఫర్ ప్రకటించింది. తమ సంస్థ ద్వారా టికెట్స్ బుక్ చేసుకున్న వారికి కాశీ విశ్వనాథుని ఆలయ ప్రాంగణంలో 18 రూమ్లు, 36 డార్మిటరీ బెడ్లను ప్రత్యేకంగా కేటాయించామని తెలిపింది. ఈ సంస్థ స్వర్ణోత్సవ సంబరాలు బుధవారం ఢిల్లీలోని లలిత్ హోటల్లో జరిగాయి. ఈ ఈవెంట్కు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి . కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సదరన్ ట్రావెల్స్ సంస్థ నూతన లోగోను ఆయన ఆవిష్కరించారు. దక్షిణ భారతదేశంలో ట్రావెలింగ్, టూరిజం రంగాలు అభివృద్ధి చెందుతుండడంలో సదరన్ ట్రావెల్స్ సంస్థ ముఖ్య పాత్ర పోషిస్తోందని కిషన్ రెడ్డి అన్నారు. 5 దశాబ్దాలుగా ట్రావెలింగ్, టూరిజం రంగాలలో విశిష్టమైన సేవలనందిస్తూ ప్రభుత్వం నుంచి 8 సార్లు బెస్ట్ డొమెస్టిక్ ఆపరేటర్ అవార్డును సొంతం చేసుకుందని ఆయన ప్రశంసించారు.
