- కొత్త సమన్లు జారీచేయని ఈడీ
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు బుధవారం 3 గంటలకుపైగా విచారించారు. కూతురు ప్రియాంకా వాద్రా, కొడుకు రాహుల్ గాంధీతో కలిసి ఉదయం 11 గంటలకు సెంట్రల్ ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకు సోనియా చేరుకున్నారు. ఐదుగురు అధికారుల బృందం 11.15 గంటలకు ఆమెను ఎంక్వయిరీ చేయడం ప్రారంభించింది. ఆ తర్వాత విచారణకు హాజరు కావాలని ఈడీ ఆమెకు ఎలాంటి సమన్లు జారీచేయలేదు. దీంతో ఈ కేసులో సోనియా విచారణ పూర్తయినట్లేనని అధికారులు పరోక్షంగా తెలిపారు. ఈ కేసులో బుధవారం నాటి విచారణను కలుపుకొని ఆమెను 11 గంటలపాటు ప్రశ్నించారు. మొత్తం వంద ప్రశ్నలు అడిగారు. ఈ నెల 21న మొదటి రౌండ్ ఎంక్వయిరీ ప్రారంభమైంది. సోనియా, రాహుల్తదితర కాంగ్రెస్ నేతలు యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్(వైఐపీఎల్) లో బోర్డు మెంబర్లు, డైరెక్టర్లుగా ఉన్నారు. నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్కు వైఐపీఎల్ ఓనర్గా ఉంది. వైఐపీఎల్లో మనీ లాండరింగ్కు పాల్పడినట్లు సోనియా, రాహుల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఆరోపణలపైనే ఇంతకుముందు రాహుల్ను కూడా ఈడీ అధికారులు ప్రశ్నించారు. తాజా విచారణలో అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్– యంగ్ ఇండియన్ డీల్ద్వారా ఎలాంటి ఆస్తులు సంపాదించలేదని సోనియా చెప్పినట్లు సమాచారం. కొవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ ఈ విచారణ చేశారు. సోనియా వాంగ్మూలాన్ని ఆడియో వీడియో తీశామని అధికారులు తెలిపారు. ఆమెను ప్రశ్నిస్తున్నంతసేపు ఈడీ కార్యాలయం బయట కిలోమీటరు వరకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. యంగ్ ఇండియన్ కంపెనీలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి 2013లో సోనియా, రాహుల్పై కేసు వేశారు. యంగ్ ఇండియన్లో సోనియా, రాహుల్ ప్రమోటర్లుగా, మెజారిటీ షేర్హోల్డర్లుగా ఉన్నారు. వారిద్దరికీ ఈ కంపెనీలో చెరో 38% వాటా ఉంది.
