వెలుగు, బిజినెస్డెస్క్: ఇండియన్ ఎకానమీకి వెన్నెముక కుటీర, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు. అంటే ఎంఎస్ఎంఈలు. కోట్ల మందికి ఉపాధి కల్పిస్తూ ఇండియన్ ఎకానమీకి తమ వంతు సాయం చేసేవి. కానీ కరోనా లాక్డౌన్ దెబ్బకు చిన్న సంస్థలు చితికి పోయాయి. యూనిట్లన్ని మూత పడ్డాయి. అరకొర తెరిచి ఉంచుదామన్నా.. లేబర్ లేరు. చేతిలో డబ్బులు లేవు. ఇటు వ్యాపారాలు నడవక, అటు ఉద్యోగులకు జీతాలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి ఈ చిన్న సంస్థలు. లాక్డౌన్ అయిపోగానే… మళ్లీ వెంటనే వ్యాపారాలు ప్రారంభించడం కూడా సంస్థలకు పెద్ద భారంగా మారింది. ఇప్పటికే చేతిలో డబ్బులు లేకపోవడంతో పాటు కొత్తగా అప్పులు పుట్టకపోవడంతో ఇప్పుడిప్పుడే వ్యాపారాలు ప్రారంభించలేమని సంస్థలు చెబుతున్నాయి. అంతేకాక సప్లయి చెయిన్ కూడా తీవ్రంగా దెబ్బతిని ఉంది. అది పునరుద్ధరించుకుని, వ్యాపారాలు ప్రారంభమవ్వాలంటే కాస్త సమయం తీసుకునేలానే ఉంది.
ముంబై, థానే ప్రాంతాల్లో ఉన్న చిన్న వ్యాపారస్తులతో కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఐఎంసీ ఛాంబర్ జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ కాన్ఫరెన్స్ లో లాక్డౌన్ తర్వాత వ్యాపారాలు తిరిగి ప్రారంభించడంపై చర్చించారు. అయితే లాక్డౌన్ తర్వాత వెంటనే వ్యాపారాలు ప్రారంభించేందుకు తాము సిద్ధంగా లేమని చిన్న సంస్థలు చెప్పాయి. ఈ సమయంలో రా మెటీరియల్ సప్లయి చెయిన్స్ అందుబాటులో ఉండవని పేర్కొన్నాయి. మే చివరి నాటికి కుదిరితే వ్యాపారాలు ప్రారంభిస్తామని పేర్కొన్నాయి. కరోనా మహమ్మారి కారణంగా 25–30 శాతం వ్యాపారాలు కోలుకోవడం కష్టమని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి. ప్రస్తుతం ఎక్కువ బాధపడుతున్న విషయం లిక్విడిటీ కొరతేనని చిన్న సంస్థలు వాపోతున్నాయి. సప్లయి చెయిన్, లేబర్ కొరత తర్వాత ఇదే అతిపెద్ద సమస్యగా మారిందంటున్నాయి. ఎంఎస్ఎంఈ యూనిట్లు సుమారు 12 కోట్ల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. పెద్ద మొత్తంలో ప్రజలు ఎంఎస్ఎంఈ యూనిట్లపైనే ఆధారపడి పనిచేస్తున్నారు. మొత్తంగా దేశంలో 6.3 కోట్ల ఎంఎస్ఎంఈ యూనిట్లున్నాయి. దేశ ఎగుమతుల్లో ఇండియా మాన్యుఫాక్చరింగ్ అవుట్పుట్లో మూడోవంతు దీనిదే ఉంది.
బెయిల్ అవుట్ ప్యాకేజీ కావాలి…
ఎంఎస్ఎంఈ రంగానికి బెయిల్ అవుట్ ప్యాకేజీ ఇవ్వాలని ప్రభుత్వానికి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీతో పాటు పలు ఇండస్ట్రీ అసోసియేషన్స్ ప్రభుత్వానికి విన్నవించుకున్నాయి. వేతనాల చెల్లింపునకు లోన్స్ ఇవ్వాలని పేర్కొన్నాయి. ఇవి కాక ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ కంట్రిబ్యూషన్ను, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్ఐసీ)ను ఆరు నెలలు రద్దు చేయాలని సంస్థలు కోరాయి. బ్యాంక్ లోన్లు త్వరగా వచ్చేలా చూడాలని, తక్కువ వడ్డీ రేట్లకు లోన్స్ ను ఇప్పించాలని ఎంఎస్ఎంఈలు అడుగుతున్నాయి. రీపేమెంట్లపై మారిటోరియాన్ని కూడా ఆరు నెలలు ఇవ్వాలని, వర్కింగ్ క్యాపిట్ లోన్స్ను మరో 25 శాతం పెంచాలని కోరాయి.
సీఐఐ కోరుతున్నవి ఇవే..
- బ్యాంకర్లు సపోర్ట్ చేయాలి.
- వర్కింగ్ క్యాపిటల్ లిమిట్ను పెంచాలి
- ప్రభుత్వ గ్యారెంటీతో 4–5 శాతం వడ్డీకి ఏప్రిల్–జూన్ వేతనాల కోసం
లోన్లు ఇవ్వాలి - ప్రభుత్వ గ్యారెంటీతో టర్మ్ లోన్లను రిస్ట్రక్చర్ చేయాలి
- ఆరు నెలల లోన్ మారటోరియాన్ని ఇవ్వాలి
- ముద్రా, ఇతర ఎంఎస్ఎంఈ ఫోకస్డ్ బ్యాంక్ల ఆస్తులను పెంచాలి
- అన్ని ప్రభుత్వ, పీఎస్యూ బకాయిలను చెల్లించాలి
- సోషల్ సెక్యురిటీ లయబులిటీల విషయంలో ఆరు నెలల పాటు ఎలాం టి పీనల్ యాక్షన్ ఉండకూడదు.
- పీఎఫ్, ఈఎస్ఐ, గ్యారెంటీ పేమెంట్స్ విషయంలో ఆరు నెలల మారటోరియం ఇవ్వాలి
- ప్రభుత్వ డిపార్ట్ మెంట్లకు డెలివరీ చేయడంలో ఆలస్యం అయితే పెనాల్టీలు విధించకూడదు
- ప్రభుత్వ ప్రాజెక్ట్ల పూర్తిపై ఊరట ఇవ్వాలి.
