జంషెడ్పూర్ : జార్ఖండ్లోని జంషెడ్పూర్లో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 8 మందితో ప్రయాణిస్తున్న కారు డివైడర్ను బలంగా ఢీకొట్టడంతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఒకరు ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయారు. గాయాలైన మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు.
ఐదు సీట్ల కారులో 8 మంది ప్రయాణిస్తున్నారని, బిస్తుపూర్ వద్ద కారు కంట్రోల్ తప్పి మొదట డివైడర్ను, ఆపై రోడ్డు పక్కనే ఉన్న స్తంభాన్ని ఢీకొట్టిందని జంషెడ్పూర్ ఎస్పీ కౌశల్ తెలిపారు. కారు నుజ్జునుజ్జు కావడంతో అందులో చిక్కుకున్నవాళ్లను అతికష్టంమీద బయటకు తీశామన్నారు. కారు ఓవర్ స్పీడ్ కారణంగా యాక్సిడెంట్ జరిగిందన్నారు. వీళ్లంతా సరైకేలా ఖర్స్వాన్ జిల్లాలోని బాబా ఆశ్రమ నివాసితులని, జంషెడ్పూర్ వెళ్తున్నారని తెలిపారు. ఆరుగురి మృతిపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సంతాపం వ్యక్తం చేశారు.
