అబుదాబి: ఔట్డోర్ ట్రెయినింగ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్రైర్స్కు ఊహించని షాక్ తగిలింది. అబుదాబిలో క్వారంటైన్ సమయాన్ని 14 రోజులకు పెంచడంతో ఈ రెండు టీమ్లు మరికొంత కాలం హోటల్ రూమ్స్కే పరిమితం కానున్నాయి. నైట్రైడర్స్ అందరికంటే ముందుగా ఆగస్టు 20న యూఏఈ చేరుకోగా, ముంబై జట్టు 21న అక్కడకు వెళ్లింది. అబుదాబి బేస్గా ఉన్న ఈ రెండు జట్లు శుక్రవారానికే ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలని భావించాయి. కానీ నిబంధనలు మార్చడంతో బీసీసీఐని ఆశ్రయించాయి. ఈ పరిస్థితిపై ముంబై టీమ్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘ ఏడు రోజుల క్వారంటైన్ అని ముందు చెప్పారు. కొత్త రూల్స్ ప్రకారం ఇప్పుడు అది 14 రోజులకు పెరిగింది. దీంతో సాయం చేయాలని బీసీసీఐని కోరాం’అని తెలిపారు. కాగా,లీగ్ షెడ్యూల్ తయారీలో ఉన్న బీసీసీఐకి కూడా రూల్స్ మార్పు కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది.
